
అర్జీలకే పరిమితం
● రాజీవ్ యువ వికాసానికి తీవ్ర జాప్యం ● ఎంపిక ప్రక్రియ పూర్తయినా అమలుకు నోచుకోని వైనం ● నిరాశలో లబ్ధిదారులు
వికారాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కు లు అందజేస్తామని హడావుడి చేసిన సర్కారు నేటికి ఆ ఊసెత్తడం లేదు. లబ్ధిదారుల ఎంపిక చేసిన అధికారులు అంతటితో మిన్నకుండి పోయారు. యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యు వ వికాసం పేరుతో నూతన పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కో సం మే 14వ తేదీ వరకు యువత నుంచి దర ఖాస్తులు స్వీకరించిన అధికారులు అనంతరం వెరిఫికేషన్ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. జిల్లాలో మొత్తంగా 50,406 అర్జీలు వచ్చాయి.
నేతల కనుసన్నల్లో ఎంపిక
మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ చేపట్టగా ఇందులో బ్యాంకర్లను కూడా భాగస్వాములను చేస్తున్నారు. అయితే బ్యాంకు సిబిల్ స్కోర్ను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం ఏమిలేదని అంతా పారదర్శకంగా చేపడుతున్నామని ప్రభుత్వంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పేర్కొంటున్నారు. అయితే నేతల కనుసన్నల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ప్రచారంలో ఉంది. దీంతో దరఖాస్తులు చేసుకున్నవారు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జూన్ 2వ తేదీనే జాబితా ప్రకటిస్తామన్న ప్రభుత్వం జాప్యం చేయడం ఏంటని అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు.
తాండూరులో అత్యధికం
జిల్లాలో దరఖాస్తుల తీరు ఇలా..
మండలం అర్జీలు
బంట్వారం 1,182
బషీరాబాద్ 2,125
బొంరాస్పేట 2,180
చౌడాపూర్ 1,741
ధారూరు 2,380
దోమ 3,136
దౌల్తాబాద్ 1,971
దుద్యాల్ 1,904
కొడంగల్ 2,156
కొడంగల్(మున్సిపల్) 760
కోట్పల్లి 1,141
కుల్కచర్ల 3,311
మర్పల్లి 1,964
మోమిన్పేట్ 1,804
నవాబుపేట్ 1,494
పరిగి 2,615
పరిగి(మున్సిపల్) 604
పెద్దేముల్ 3,200
పూడూరు 2,320
తాండూరు 3,456
తాండూరు(అర్బన్) 2,350
వికారాబాద్ 1,423
వికారాబాద్(అర్బన్) 2,903
యాలాల 2,286
మొత్తం 50,406
మే నెల మొదటి వారంలో 20 మండలాలతో పాటు నాలుగు మున్సిపాలిటీల నుంచి రాజీవ్ యువ వికాసం పథకం(ఆర్వైవీసీ) కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో కొడంగల్ మున్సిపాలిటీలో అత్యల్పంగా 760 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకోగా.. అత్యధికంగా తాండూరు మండలంలో 3,456 మంది అర్జీ పెట్టుకున్నారు. మండలాలు, మున్సిపాలిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల వారీగావిభజించి వెరిఫికేషన్ పూర్తి చేశారు. నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో కలిపి 50,406 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వారు ఎంపిక చేసుకున్న యూనిట్ ధరను బట్టి రూ.లక్ష నుంచి గరిష్టంగా రూ.4 లక్షల వరకు రాయితీపై రుణాలు అందజేయనున్నారు.