
పని ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి
తాండూరు రూరల్: ఉపాధి హామీ కూలీ గుండెనొప్పితో మృతి చెందాడు. ఈ ఘటన పెద్దేముల్ మండలం దుగ్గాపూర్లో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె పెద్ద అమృతయ్య(59) వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. వేసవికాలం దృష్ట్యా పనులు లేకపోవడంతో గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగా శనివారం ఉదయం తోటి కూలీలతో కలిసి పని చేస్తుండగా గుండెలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని తాండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
ఉపాధి కూలీ అమృతయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి చేయూత అందేలా చూస్తామని ఎంపీడీఓ రతన్సింగ్ అన్నారు. ఆయన మృతి విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశామని తెలిపారు. కూలీలు ఎండబారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.