
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ అర్బన్: పోలింగ్ కేంద్రాల్లో 27వ తేదీ నాటికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ సీ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలింగ్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గం, మండల పర్యవేక్షణ పోలింగ్ లోకేషన్ మోడల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, ఫ్యాన్లు, నీటి వసతి, టాయిలెట్స్, టెంట్, ఫర్నిచర్ వంటివి సమకూర్చుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి ఎన్నికల అధికాలు పోలింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అభ్యర్థులు తమ ప్రచారాలను పూర్తిగా నిలిపివేయాలని కలెక్టర్ సూచించారు. ప్రచార ప్రక్రియ ముగిసిన తరువాత ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని సూచించారు. జిల్లాలోని సరిహద్దు చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి ఈ నెల 29న ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. 30వ తేదీ ఉదయం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రాల్లో ఉండాలని ఆదేశించారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ చేపట్టి 30 నిమిషాల్లో పూర్తి చేయాలన్నారు. 7 గంటలకు పోలింగ్ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాయంత్రం ఐదు గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లకు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీఓ తరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
27లోపు మౌలికవసతులు కల్పించాలి
28వ తేదీ సాయంత్రం 5గంటల లోపు ప్రచారాలు ముగించాలి
29న పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ
కలెక్టర్ నారాయణరెడ్డి