భూ వివాదంలో దోమ ఎస్‌ఐ!

దోమ: భూ వివాదంలో ఎస్‌ఐ విశ్వజన్‌ తలదూర్చారు. ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్‌ పట్టణానికి చెందిన యాదగిరి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. నవాబుపేట మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఎస్‌ఐ విశ్వజన్‌కు యాదగిరితో పరిచయం ఏర్పడింది. ఎక్కడైనా భూమి ఉంటే చెప్పండి కొనుగోలు చేస్తానని ఎస్‌ఐ రియల్లర్‌ను కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో నవాబుపేట మండలం కేశవపల్లిలో రైతు హన్మంతుకు చెందిన 21 గుంటల పొలం కొనేందుకు ఎస్‌ఐ రూ. 32 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా రూ. 9 లక్షలు ఇచ్చి తన స్నేహితుడిపై అగ్రిమెంట్‌ చేయించాడు. మిగత డబ్బు ఆరు నెలల తర్వాత నేరుగా రైతు అకౌంట్‌లో వేసి ఎస్‌ఐ తన స్నేహితుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఇదిలా ఉండగా సదరు రైతు నవాబుపేటలో ఓ ప్లాట్‌ కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందుకోసం రియల్టర్‌ యాదగిరిని సంప్రదించాడు.

రూ. 18 లక్షలకు ఆ ప్లాట్‌ను రైతుకు ఇప్పించేందుకు యాదగిరి ఒప్పందం కుదుర్చాడు. ఇందులో భాగంగా ఎస్‌ఐ ఇచ్చిన రూ. 9లక్షలతో పాటు రైతు వద్ద మరో రూ. రెండు లక్షలు తీసుకొని ప్లాట్‌ యజమానికి ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా రైతు ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. ఈ విషయమై రియల్టర్‌ యాదగిరి అడగ్గా తన వద్ద డబ్బు లేదని తాను ఇచ్చిన రూ. 11 లక్షలు తిరిగి ఇప్పించాలని కోరాడు. ఇదే విషయాన్ని రియల్టర్‌ ప్లాటు యజమానికి తెలిపాడు. అయితే పాట్లు యజమాని తన వద్ద ఇప్పుడు అంత డబ్బు లేదని రైతు ఇచ్చిన రూ.11 లక్షల్లో రూ. 5 లక్షలు తిరిగి ఇచ్చాడు. ఈ డబ్బును ఎస్‌ఐ స్నేహితుడి అకౌంట్‌లో వేసినట్లు రియల్టర్‌ తెలిపారు.

ఈ విషయంపై ఎస్‌ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. నవాబుపేటలో 20 గుంటల భూమిని తన స్నేహితుడికి రియల్టర్‌ యాదగిరి రూ.32 లక్షలకు ఇప్పించాడు. అందులో రూ. 8 లక్షలు రైతుకు ఇస్తానని తీసుకున్న రియల్టర్‌ తన స్నేహితుడిపై భూమి అగ్రిమెంట్‌ చేయించాడు. అగ్రిమెంట్‌ చేయించిన తర్వాత ఆరు నెలలైన తన స్నేహితుడికి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించలేదు. తన వద్దకు రాలేదు. దీంతో అనుమానం వచ్చి రైతును తాను ప్రశ్నించగా తనకు రియల్టర్‌ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పాడు.

అగ్రిమెంట్‌కు ఇచ్చిన డబ్బులను రియల్టర్‌ యాదగిరి తన సొంత అవసరాలకు వాడుకొని రైతుకు ఇవ్వలేకపోయాడు. ఇట్టి విషయం గట్టిగా రియల్టర్‌ను అడుగగా రూ. 8 లక్షల్లో కొన్ని రైతుకు ఇచ్చాడు. మిగత రూ.3 లక్షల 50 వేలు ఇవ్వలేకపోయాడు. అట్టి డబ్బులను మీరు ఇప్పించండి అంటూ రైతు ఎస్‌ఐని కోరి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించాడు. మిగత డబ్బులు రోజులు గడుస్తున్న రియల్టర్‌ ఇవ్వకపోవడంతో రైతు తనకు, తన స్నేహితుడికి కాల్‌ చేయడం ప్రారంభించాడు. దీంతో తాను ఈ విషయంపై రియల్టర్‌ను గట్టిన ప్రశ్నించానని ఎస్‌ఐ విశ్వజన్‌ తెలిపారు.

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top