తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 32 అంగన్వాడీ వర్కర్లు, 166 అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ వసంతబాయి తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 21 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మీ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులో అందజేయాలని సూచించారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలని చెప్పారు. 01.07.2026 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులని తెలిపారు. స్థానిక వివాహితులు అర్హులని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత లేకుంటే 8వ తరగతి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. నాయుడుపేట, సూళ్లురుపేట, సత్యవేడు, కోట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, పిచ్చాటూరు, చంద్రగిరి, పుత్తూరు, రైలేకోడూరు, చిట్వేలి మండలాల పరిధిలో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.
గరుడ సేవకు కట్టుదిట్టమైన భద్రత
తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవకు తిరుమల సిద్ధమైంది. గరుడ వాహనంపై కొలువుదీరే శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది. గరుడ వాహన సేవను రాత్రి 6.30 గంటలకు ప్రారంభించనున్నట్టు అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు.
1,200 మంది పోలీసులతో అదనపు భద్రత
బ్రహ్మోత్సవాల భద్రతను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది సుమారు 1,130 మందితోపాటు 3,600 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా మరో 1,200 మంది పోలీసులతో అదనపు భద్రత కల్పించారు. 2,770 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఘాట్రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశారు.
విశేష విహారం
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మో త్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం బంగారు చిన్న శేష వాహనంపై ఊరేగారు. రాత్రి ఉభయకర్తల ఆధ్వర్యంలో బంగారు పెద్ద శేష వాహనంపై వినాయకస్వామిని కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపించారు.


