తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకరణలో కల్యాణ వెంకన్న భక్తులను కటాక్షించారు. రాత్రి ఉభయదేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సర్వభూపాల వాహనంపై సర్వభూపాలునిగా పురవీధుల్లో విహరిస్తూ కనువిందు చేశారు. కల్పవృక్ష వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం అవిలాల, గాంధీపురం, సాయినగర్, లింగేశ్వరనగర్, వెంకటపతినగర్, పేరూరు పంచాయతీలకు చెందిన భక్తులు సారెను సమర్పించారు. అలాగే రాత్రి జరిగిన సర్వభూపాల వాహనంకు చిన్నగొట్టిగల్లు మడలానికి చెందిన చిన్నగొట్టిగల్లు, జంగావాండ్లపల్లి, రంగన్నగారిగడ్డ, కోటబైలు, భాకరాపేట, దేవర కొండ, దీన్దార్లపల్లి, చిట్టేచర్ల, చట్టేవారిపాలెం, తిప్పిరెడ్డిగారిపల్లి, దిగవూరు, ఎగవూరు, నెల్లుట్ల వారిపల్లి గ్రామాలకు చెందిన భక్తులు సారె తీసుకువచ్చారు. అలాగే ఇస్కాన్ అధ్యక్షులు రేవతిరమణదాస్, వారి శిష్య బృందం ఆలయం వద్దకు చేరుకుని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్రెడ్డి సాదరస్వాగతం పలికారు.
– తిరుపతి రూరల్


