డయల్‌ యువర్‌ సీఎండీకి 75 వినతులు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ సీఎండీకి 75 వినతులు

Sep 16 2026 8:46 AM | Updated on Sep 16 2026 8:46 AM

తిరుపతి రూరల్‌: డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమానికి 75 వినతులు వచ్చినట్టు సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. ప్రతి సోమవారం ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం, సర్కిల్‌ కార్యాలయాల్లో నిర్వహించే డయల్‌ యువర్‌ సీఎండీ, డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని వినాయక చవితి సందర్భంగా సోమవారం సెలవుదినం కావడంతో మంగళవారం నిర్వహించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 75 మంది వినియోగదారులు తమ విద్యుత్‌ సమస్యలను సీఎండీకి విన్నవించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్‌, కె.గురవయ్య, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు జె.రమణాదేవి, ఎన్‌.శోభా వాలెంటీనా, ఆర్‌.పద్మ, ఎం.మురళీకుమార్‌, సిహెచ్‌ రామచంద్రరావు, కే.సంపత్‌ కుమార్‌, ఎస్‌.రమణ, ఎం.శ్రీకాంత్‌, ఏ.శ్రీనివాసబాబు, జనరల్‌ మేనేజర్లు జగదీష్‌, భాస్కర్‌రెడ్డి, హేమలత, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజీపీ నేత బైక్‌ దగ్ధం

చంద్రగిరి: మండల బీజేపీ నేత ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చంద్రగిరి శ్రీనివాసశెట్టి సందు వీధికి చెందిన కాకిమాను మునిరాజ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున తన ఇంటి సమీపంలో ఉంచిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై పెట్రోల్‌ పోసి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో బైక్‌ పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. వినాయక చవితి పండుగకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు పెట్టామనే కక్షతో తన బైక్‌కే నిప్పటించారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

బైక్‌ను ఢీకొన్న శ్రీసిటీ బస్సు

– వ్యక్తికి తీవ్ర గాయాలు

చిట్టమూరు: నాయుడుపేట–మల్లాం రహదారిలో చిట్టమూరు మండలం, బయ్యవారికండ్రిగ గ్రామం వద్ద సోమవారం శ్రీసిటీకి వెళ్తున్న బస్సు మోటార్‌ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లకూరు మండలం, చెంబేడుకు చెందిన రామచంద్రయ్య మోటార్‌ బైక్‌పై నాయుడుపేట నుంచి మల్లాం వైపు వస్తుండగా, తడ మండలం నుంచి శ్రీసిటీలోని ఓ కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్‌ బైక్‌పై వెళ్తున్న రామచంద్రయ్యకు గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

తిరుపతిలో ట్రెకింగ్‌–ఐ

తిరుపతి సిటీ: తిరుపతి ఎన్‌సీసీ నగర్‌లో ఆల్‌ ఇండియా ఎన్‌సీసీ ఏపీ ట్రెక్‌–ఐ పేరుతో ఇండియన్‌ సీనియర్‌, జూనియర్‌ డివిజన్‌ ఎన్‌సీసీ క్యాడెట్లకు ట్రెకింగ్‌ యాత్ర చేపట్టారు. ఈనెల 12 ప్రారంభమైన యాత్ర ఈనెల 19 వరకు జరగనుంది. తిరుపతి ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్స్‌ 5వ ఆంధ్ర గర్‌ల్స్‌ బెటాలియన్‌ నిర్వహిస్తున్న ట్రెకింగ్‌ యాత్రలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌, కేరళ, లక్ష్యదీప్‌, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర డైరెక్టరేట్లకు చెందిన 510 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, 15 మంది ఎన్‌సీసీ అధికారులు పాల్గొంటున్నారు. ట్రెకింగ్‌ షెడ్యూల్‌లో భాగంగా క్యాడెట్లు తిరుమల, జూపార్క్‌, సైన్స్‌ సెంటర్‌ వంటి కేంద్రాల్లో శిక్షణ, సాహస కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్‌సీసీ గ్రూప్‌ హెడ్‌ క్వార్టర్స్‌ గ్రూప్‌ కమాండర్‌, ట్రెక్‌ మేనేజర్‌ కల్నల్‌ ఎకే.శర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement