నాయుడుపేట టౌన్: అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను భయపెట్టలేరని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు తేల్చిచెప్పారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ పెళ్లకూరు మండల పరిధిలోని చిల్లకూరులో జరిగిన చిన్నపాటి ఘటనను పెద్దదిగా చూపించి, ఒత్తిడితో మృతి చెందిన విషయాన్ని హత్యాయాత్నంగా చిత్రీకరించి తీవ్రమైన సెక్షన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నమోదు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని వ్యక్తులను సైతం కేసుల్లో ఇరికిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇక్కడి పోలీసుల తీరుపై గవర్నర్తో పాటు డీజీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు సైతం దాఖలు చేసి న్యాయపోరాటానికి సన్నద్ధమవుతామని వారు స్పష్టం చేశారు.
యథేచ్ఛగా ఇసుక, మట్టి దందా
నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ దందాతో సాగుతోందని మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి భయపెట్టాలని చూడడం అవివేకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యనారాయణరెడ్డి మండలంలో ఉంటే టీడీపీ, కూటమి నాయకుల నాటకాలు సాగవనే దుర్బుద్ధితో టీడీపీ నేతలు ఆయనపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్కు పంపారని తెలిపారు.
ఘనంగా ఎంపీ మిథున్రెడ్డి జన్మదిన వేడుకలు
నాయుడుపేట ఆర్అండ్బీ అథితిగృహం వద్ద రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సారథ్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్చేసి మిథున్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కలిక మాధవరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, మద్దాల సోమశేఖర్రెడ్డి, ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు పాదర్తి హరినాథ్రెడ్డి, పెళ్లకూరు ఎంపీపీ శేఖర్రెడ్డి, పెళ్లకూరు పార్టీ అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం, ఈదా రత్నశ్రీ, చదలవాడ కుమార్, పట్టాభిరెడ్డి పాల్గొన్నారు.


