చేనేత కార్మికుల కడుపు కొడుతున్న కూటమి ప్రభుత్వం
వెంకటగిరి(సైదాపురం): స్థానిక సంస్థ ఎన్నికల్లో పారదర్శకంగా నిర్వహించాలని పదే పదే వైఎస్సార్సీపీ కోరుతున్నా.. మృతి చెందినవారితోపాటు వలస వెళ్లిన ఓటర్ల జాబితాతో స్థానిక ఎన్నికల నిర్వహణ ఎలా చేస్తారంటూ వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ సర్ పక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సవరణలు పూర్తవుతున్నాయని ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైఏస్సార్సీపీ కోరుతున్నట్లు తెలిపారు. ఇందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నపళంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గంలో 36వేల ఓట్లు అనర్హుల ఓట్లను అధికారులు గుర్తించారన్నారు. అదేవిధంగా మున్సిపాల్టీలో 8వేల ఓట్లు అనర్హత ఓట్లుగా గుర్తించి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు. గతంలో 44 వేల ఓటర్లు ఉన్న మున్సిపాలిటీలో అధికారుల గణాంకాల లెక్కల ప్రకారం ప్రస్తుతం 36వేల ఓటర్లు అధికారంగా ఉన్నట్లు నిగ్గు తేల్చారన్నారు. ఈ ఓటర్ల ఆధారంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. 25 వార్డులుగా ఉన్న వెంకటగిరి మున్సిపాలిటీ గెజిట్ ప్రకారం 36 వార్డులుగా విభజించేందుకు మే నెలలో అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ సమయంలో వార్డుల విభజన పారదర్శకంగా నిర్వహించాలని వినతిపత్రం ద్వారా మున్సిపల్ అధికారులకు నివేదికలను సమర్పించామని అయినప్పటి తన నివేదికలను పక్కన పెట్టి వార్డుల విభజనలో ఇష్టారాజ్యాంగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక వార్డుల్లో 1400 ఓట్లు, మరో వార్డులో 750 ఓట్ల జనాభాతో, వార్డులోని సంబంధంలేని వ్యక్తులకు కూడా వేరే వార్డుల్లో ఓటు హక్కు కల్పిచడం వంటి అవకతవకలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదంతా స్థానిక ప్రజా ప్రతినిధికి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలియజేశారు.
అధికార పార్టీ నేతల అండదండలతో ప్రజలకు న్యాయం చేయకుండా ప్రశ్నించినా ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్న అధికారులు మూల్యం చెల్లించక తప్పదని నేదురుమల్లి హెచ్చరించారు. నేతన్న సేవలో నిధులను కూటమి నేతల కనుసన్నల్లో మృతి చెందిన వారికి సైతం నిధులు జమ చేశారని ఆరోపించారు. దీంతో కడుపుమంటతో రోడ్డెక్కిన చేనేత కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉండి పోరాటాలు సైతం కొనసాగిస్తామన్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, బఫర్ జోన్లలో సైతం అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలు వంటివి మితిమీరిపోతున్నాయని వాటిని నివారించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ డీఎస్సీ స్కామ్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. స్పోర్ట్స్ కోటాలో క్రీడలు ఆడని వారు, ఉపాధ్యాయులుగా అర్హతే లేని వారిని ఉపాధ్యాయులుగా ఏంపిక చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు పులి ప్రసాద్రెడ్డి, బాలాయపల్లి, డక్కిలి మండలాల అధ్యక్షులు వెందోటి కార్తీక్రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు చిట్టేటి హరికృష్ణ, సేతరాసి బాలయ్య, సదానందరెడ్డి, కందాటి రాజారెడ్డి, ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి, రొంటాల చిన్నా, గోపాల్ యాదవ్, ములవాయిల వెంకటేశ్వర్లు, సతీష్, రౌవరత్ కుమార్, కాసారం నీలకంఠం, వెందోటి బాబు, పూజారి లక్ష్మి, కాటూరు రామతులసి, సుకన్య, కందాటి కళ్యాణి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
తప్పుచేసిన అధికారులు మూల్యం చెల్లించక తప్పదు


