తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
తిరుమల స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల వాసులకు అండగా ఉంటానని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ శ్రీధర్వర్మ తెలిపారు. పార్టీలకు అతీతంగా స్ధానిక ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల స్థానికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తామని తిరుమల స్థానికులకు తెలిపారు.
82 బస్తాల
రేషన్ బియ్యం స్వాధీనం
పెళ్లకూరు: మండలంలోని పునబాక గ్రామంలో సోమవారం జిల్లా విజిలెన్స్ అధికారులు 82 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన రేషన్ బియ్యం వ్యాపారి సాయి అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షల విలువ చేసే 82 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోదాముకు తరలించారు. ఈ మేరకు కేసు కేసు దర్యాప్తులో ఉంది. డీటీ యువరాజ్, వీఆర్వో సుధాకర్ పాల్గొన్నారు.
ప్రైవేట్ బస్సు డ్రైవర్కు జైలు
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్కు ఐదు రోజులు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు పట్టణంలోని 2 టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. తొట్టంబేడు మండలం, మామిడిగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్ ఇటీవల మద్యం సేవించి ప్రయివేటు బస్సు నడపగా... డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్టు తెలిపారు.
ఫైర్ ఫైటింగ్పై అవగాహన
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రత, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తిరుమలలో ఫైర్ ఫైటింగ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ ఆదేశాల మేరకు సోమవారం ఆస్థాన మండపంలో తిరుమల డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై ఫైర్ సిబ్బందికి అవగాహన కల్పించారు.


