తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో ఈనెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యేందుకు పోలీసు అధికారులు సహకరించాలని తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ సూచించారు. సోమవారం సాయంత్రం తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టు హాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో న్యాయమూర్తి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి గురునాథ్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులను ముందుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లెనిన్ బాబు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి, తిరుపతి ఏఎస్పీ శ్రీలత, వివిధ స్టేషన్ల సీఐలు, కోర్టు కానిస్టేబుళ్లు, లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు.
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
రేణిగుంట: మామండూరు–రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య కరకంబాడి సమీపంలో సోమవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. రైల్వే పోలీసులకు ఉదయం 10 గంటలకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రైలు పట్టాల పక్కన సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎగువ మార్గంలో వెళ్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నల్లటి లైన్లు, నల్లటి షర్ట్, లైట్ బ్రౌన్న్ రంగు లోదుస్తులు ధరించి ఉన్నాడు. కుడివైపు వీపు పైభాగంలో నల్లటి పుట్టుమచ్చ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


