రేణిగుంట: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మండల మేజిస్ట్రేట్ శ్రావణ్కుమార్ ఆదేశాలు జారీచేశారు. పోలీసుల కథనం.. కడప జిల్లా, సెట్టిగుంట మండలానికి చెందిన బండి జయచంద్ర (26) ప్రస్తుతం రేణిగుంట మండలంలోని చెంగారెడ్డిపల్లి పీఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడి పై రేణిగుంట పోలీస్ స్టేషన్లో 3, గాజుల మండ్యంలో 1, రైల్వేకోడూరులో 1, ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మొత్తం ఆరు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో అర్బన్ పోలీస్ స్టేషన్లో జయచంద్ర పై గతంలో రౌడీషీటర్ ఓపెన్ చేశారు. 02–05–2026 తేదీన అర్బన్ సీఐ జయచంద్ర రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట జయచంద్రను బైండోవర్ చేయించారు. బైండోవర్లో ఉన్నప్పటికీ 17–08–2026 రాత్రి చెంగారెడ్డిపల్లి గ్రామంలో మద్యం సేవించి గొడవకు పాల్పడి, కొందరిపై దాడి చేసినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు.
బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సోమవారం జయచంద్రను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, విచారణ అనంతరం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.


