తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ వాహనాల మరమ్మతుల నిర్వహణలో భాగంగా సోమవారం అలిపిరి బాలాజీ బస్టాండ్లో శాశ్వత వాహన తనిఖీ కేంద్రాన్ని జిల్లా ప్రజా రవాణాధికారి (డీపీటీవో) కె.శ్రీనివాసరావు ప్రారంభించారు. నిర్దేశిత డిపోల బస్సుల తనిఖీ నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ తనిఖీల్లో బస్సులోని కీలకమైన భాగాల్లోని బ్రేకింగ్, స్టీరింగ్, సస్పెన్సన్, ఎలక్ట్రిక్ లైటింగ్. ఇంజిన్ కూలింగ్, టైర్లు వంటి వాటిలో చిన్నపాటి లోపాన్ని సైతం గుర్తించి వాటిని మరమ్మతులు చేయించిన తరువాతనే తిరుమల ఘాట్లో ప్రయాణానికి అనుమతిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ బాలాజీ, సూళ్లూరుపేట డీఎం కళ, వివిధ డిపోల నుంచి విచ్చేసిన మెకానిక్ సిబ్బందితో పాటు వెంకటగిరి, అలిపిరి, చిత్తూరు డిపోల అసిస్టెంట్ ఇంజినీర్లు ప్రభాకర్, ఆనంద్, జగదీష్ పాల్గొన్నారు.


