తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో యూజీ ప్రవేశాలకు సంబంధించి ఓఏఎమ్డీసీలో వెబ్ ఆప్షన్ల నమోదు గడువు గురువారంతో ముగియనుంది. శుక్రవారం వెబ్ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇస్తూ సెప్టెంబర్ 2వ తేదీన తొలివిడత అడ్మిషన్ల మెరిట్ లిస్ట్ను అధికారులు విడుదల చేయనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు 3వ తేదీ నుంచి 7వ తేదీలోపు ఆయా కళాశాలలో రిపోర్టు చేసి తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి తిరుపతి జిల్లా శాఖ నేతలు ఆరోపించారు. బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్లో వారు మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన రూ.40 వేల కోట్ల బకాయిలను సాధించుకునేందుకు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28న విజయవాడలో చేపట్టనున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర స్థాయి సదస్సులో సమస్యల సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా, వినతిపత్రాలు ఇచ్చినా, చర్చలకు హాజరైనా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. నేతలు గోపీనాథరెడ్డి, మస్తాన్, బి.రేఖ, సునీల్దత్, గోపాల్, ఆర్.శంకర్, మునికృష్ణయ్య, కృష్ణమూర్తి, ఏబీ సుబ్రమణ్యం, సిద్ధయ్య, దేవరాజులు, భాస్కర్ పాల్గొన్నారు.
కనిపించవా.. సీమ రైతు కష్టాలు
తిరుపతి మంగళం : రాయలసీమలో సాగునీరు, తాగునీటి కోసం రైతులు పడుతున్న కష్టాలు కనిపించవా చంద్రబాబు అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కో–ఆర్డినేటర్ వెలకచర్ల గోపాల్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీమ రైతులు, ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ాధ్యన్ని 44వేల క్యూసెక్కులకు పెంచింది మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ పనులను 80శాతం పూర్తి చేసిన ఘనత జగనన్నదే అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సర్కారుతోఓ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. సీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేపడితే అడ్డుకోవడం చంద్రబాబు నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.
వ్యాసాశ్రమ ఉత్సవాల
బందోబస్తు కష్టం
తిరుపతి అర్బన్ : ఏర్పేడు వ్యాసాశ్రమంలో గురువారం నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు నిర్వహించాల్సిన శతాబ్ది ఉత్సవాలకు బందోబస్తు కల్పించలేమని పోలీసులు తెగేసి చెప్పేశారు. వ్సాసాశ్రమం కోశాధికారి అమరనాథ్రెడ్డి అఽందించిన వినతిపై...హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్లో ఎస్పీ సుబ్బరాయుడు, దేవదాయశాఖ అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం ఉత్తర్వులు విడుదల చేశారు. అశ్రమ పాలకవర్గం, మాజీ విద్యార్థులు, భక్తుల మధ్య వివాదాలు పరిష్కారం కాకపోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్సవాలకు బందోబస్తు నిర్వహించడం కష్టమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఉత్సవాలను వాయిదా వేసుకుని, మరో తేదీకి రీషెడ్యూల్ చేయాల్సిందిగా ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు. ఒకవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మరోవైపు వినాయకచవిత పండుగ నేపథ్యంలో వ్యాసాశ్రమానికి తగినంత బందోబస్తు ఏర్పాటు చేయలేమని వెల్లడించారు. మళ్లీ ఉత్సవ తేదీలను ఖరారు చేసే ముందు ఆశ్రమానికి తరలివచ్చే భక్తుల అంచనా సంఖ్యతోపాటు పూర్తి వివరాలను రాతపూర్వకంగా పోలీసుశాఖకు అందించాలని కోరారు. ఈ క్రమంలోనే ఆశ్రమంలోని ఇరువర్గాల వారు సామాజిక, ఇతర మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పీఆర్టీయూ జిల్లా కార్యవర్గం
తిరుపతి ఎడ్యుకేషన్: పీఆర్టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. తిరుపతిలోని విశ్వం హైస్కూల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా ఎం.సుధాకర్ ఆచారి, ప్రధాన కార్యదర్శిగా జోగి గురుప్రసాద్ యాదవ్ ఎన్నికయ్యారు.


