తాడేపల్లెలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం
గ్రామ.. వార్డు జిల్లా అధికారిగా విజయలక్ష్మి
తిరుపతి అర్బన్: స్వర్ణ గ్రామ, వార్డు అధికారిగా విజయలక్ష్మి కలెక్టరేట్లోని తమ చాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతపురం జిల్లా నుంచి ఆమె బదిలీపై తిరుపతికి వచ్చారు.
ముక్కంటి హుండీ లెక్కింపు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ లెక్కింపును బుధవారం కొట్ట మండపంలో చేపట్టారు. ఈఓ బీకే వెంకటేశులు మాట్లాడుతూ ప్రధాన హుండీతోపాటు పరివార దేవతల వద్ద హుండీలను సైతం లెక్కించినట్లు వెల్లడించారు. ఈ మేరకు రూ.1,36,83,425 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే బంగారం 11.400 గ్రాములు, వెండి 406.290 కిలోలు, విదేశీ కరెన్సీ 77 వచ్చినట్లు వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
ఆర్టీసీ డీపీటీఓగా శ్రీనివాసరావు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : జిల్లా ప్రజారవాణా అధికారి (డీపీటీఓ)గా కె. శ్రీనివాసరావు నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు రీజనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పనిచేసిన జగదీష్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉద్యోగోన్నతిపై నెల్లూరుకు బదిలీపై వెళ్లారు. ఈ క్రమంలో విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. డీపీటీఓ మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రవాణా సేవలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అలిపిరి బాలాజీ బస్ స్టాండ్లో చేపట్టిన సాంకేతిక క్యాంపును సందర్శించారు. డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్, డీప్యూటీ సీఎంఈ బాలాజీ, అలిపిరి ఎంఎఫ్ ప్రభాకర్, సత్యవేడు డిపో మేనేజర్ కేవీ రమణ పాల్గొన్నారు.
తిరుమలలో
బీడీ తాగిన వ్యక్తిపై కేసు
తిరుమల : తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. తిరుమల వరాహస్వామి కార్ పార్కింగ్ ప్రాంతంలో బహిరంగంగా బీడీ తాగిన వ్యక్తి కేసు నమోదు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను పోలీసులు పరిశీలించారు. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తమిళనాడు రాష్ట్రం అరక్కోణం జిల్లా పాళనిపేటకు చెందిన ఆర్. సంతోష్ (31)ను నిందితుడిగా గుర్తించారు. అనంతరం సంతోష్ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాలు, టీటీడీకి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో మద్యం, ధూమపానం, మత్తు పదార్థాల వినియోగం నిషేధమని పోలీసులు తెలిపారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
వెబ్ డెవలపర్ శిక్షణకు దరఖాస్తులు
తిరుపతి సిటీ : జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వెబ్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా జిల్లాలోని నిరుద్యోగ యువతను గుర్తించి ఆయా ప్రాంతాలలోని పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే దిశగా స్కిల్ హబ్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ను స్కిల్ హబ్గా ఎంపిక చేసినట్లు వివరించారు. రిజిస్ట్రేషన్తో పాటు ఇతర వివరాలకు 8143576866 నంబర్లో సంప్రదించాలని సూచించారు.


