ఇసుక, మట్టి, లిక్కర్ దందా నడిపిస్తున్న కూటమి నేతలు రూ.కోట్ల ముడుపులు చెల్లించి యథేచ్ఛగా వనరుల దోపిడీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నాయుడుపేట టౌన్ : చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని, ఇసుక, మట్టి, లిక్కర్ దందాలను కూటమి నేతలు యథేచ్ఛగా సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. బుధవారం నాయుడుపేటలోని స్వర్ణముఖి నదిని పరిశీలించారు. నదిలో అక్రమంగా వేసిన రహదారిని చూసి దిగ్భ్రాంతి చెందారు.
తెలుగు గంగ నీరు సైతం పోకుండా అడ్డుకట్ట వేయడంపై మండిపడ్డారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే, ఇన్చార్జిల పేరుతో నడిపిస్తున్న దందాను మీడియాకు ప్రత్యక్షంగా చూపించారు. సంజీవయ్య మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని, ప్రకృతి వనరులను దోచుకుంటూ రూ.కోట్లు దిగమింగుతున్నారని ఆరోపించారు. స్వర్ణముఖి నదిలో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తవ్వేసి తరలించేస్తున్నారని విమర్శించారు. అక్రమాలపై కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పచ్చ పత్రికలు సైతం కూటమి నేతల అవినీతిని ఎండగడుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఐదుగురు ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారని స్పష్టం చేశారు.
వీఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ముడుపులు చెల్లిస్తున్నట్లు అధికార పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారని విమర్శించారు. ఎకై ్సజ్ అధికారుల అలసత్వంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయని ఆరోపించారు. స్వర్ణముఖి నది దుస్థితిని జిల్లా అధికారులు ప్రత్యేకంగా పరిశీలించి తగు చర్యల చేపట్టకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్త్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కలికి మాధవరెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి, కటకం జయరామయ్య, బైనా మల్లికార్జునరెడ్డి, పేట చంద్రారెడ్డి, చదలవాడ కుమార్, దారా రవి, పేర్నాటి రాహుల్, గంధవల్లి సిద్ధయ్య, రాయపు శేఖర్, కాలగంధ సునీల్, బాలకృష్ణారెడ్డి, నెలవల రవి, షేక్ షబ్బీర్, రహంతుల్లా పాల్గొన్నారు.


