అక్రమ అరెస్ట్‌పై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

అక్రమ అరెస్ట్‌పై ఆందోళన

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

వాసుయాదవ్‌ను అన్యాయంగా ఇరికించారు వెనకడుగు వేయకుండా న్యాయపోరాటం దీక్షా శిబిరంలో వాసు తల్లి రేణుకా యాదవ్‌ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసు జులం ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు.. పరామర్శించిన అభినయ్‌

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌ : వైఎస్సార్‌సీపీ నేత వాసు యాదవ్‌ అక్రమ అరెస్ట్‌పై యాదవ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. బుధవారం ఈ మేరకు పోస్టాఫీస్‌ సమీపంలో వాసుయాదవ్‌ తల్లి రేణుకా యాదవ్‌ నిరాహారదీక్ష చేపట్టారు. ఆమె మాట్లాడుతూ తమ కుమారుడు వాసు యాదవ్‌ ఎలాంటి నేరం చేయలేదన్నారు. అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ తిరుపతి ఇన్‌చారి జేబీ శ్రీనివాస్‌ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. నాకొడుకు మీ ఇంటికి వచ్చినట్లు నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతామన్నారు. యాదవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు జేబీ శ్రీనివాస్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మాజీ మేయర్‌ డాక్టర్‌ శిరీష మాట్లాడుతూ తిరుపతిలో యాదవులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో యాదవులకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. వాసు యాదవ్‌పై అక్రమంగా, అన్యాయంగా తప్పుడు కేసు పెట్టారన్నారు. వైఎస్సార్‌ సీపీ ఉపాధ్యక్షులు గీతా యాదవ్‌ మాట్లాడుతూ ఎక్కడో కిలోమీటర్‌ దూరంలోని టీ దుకాణం దగ్గర ఉన్న వాసు యాదవ్‌కు జేబీ శ్రీనివాస్‌ ఇంటి దగ్గర దాడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒక తల్లిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యాదవులను అసభ్యంగా దూషించిన జేబీ శ్రీనివాస్‌ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.

20 మందిపై కేసు

తిరుపతి క్రైం : అనుమతి లేకపోయినా రేణుక యాదవ్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సెంట్రల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద ధర్నాకు యత్నించినందుకు కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ధర్నాకు యత్నించి పోలీస్‌ యాక్ట్‌ను ఉల్లంఘించినందుకు రేణుక యాదవ్‌ సహా సుమారు 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. కేసు నమోదైన వారిలో మాజీ మేయర్‌ డాక్టర్‌ శిరీష, ఉమ, అనిల్‌, గీతా యాదవ్‌, కట్ట గోపి యాదవ్‌ తదితరులు ఉన్నారు. కాగా శాంతియుత ధర్నా కోసం ముందస్తుగా పోలీసుల అనుమతి కోరినప్పటికీ యాక్ట్‌ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి నిరాకరించారని తెలిపారు.

భూమన అభినయ్‌ పరామర్శ

ఎస్వీ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌లో యాదవ సంఘాలు ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నేతలు రేణుక యాదవ్‌, డాక్టర్‌ శిరీష యాదవ్‌, గీతా యాదవ్‌ను పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో బీసీలపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు స్వగ్రామానికి కూతవేటు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ తిరుపతి ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌ ఇంటిపై దాడి చేశారంటూ జర్నలిస్టులపై సైతం అక్రమంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వాసు యాదవ్‌ తల్లి రేణుక యాదవ్‌కు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈడ్చుకుంటూ.. స్టేషన్‌కి

పోస్టాఫీసు వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యాదవ సంఘం నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఆందోళనకు అనుమతి లేదంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య నిరసన కారులను ఈడ్చుకుంటూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్వీయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ముందుగా యాదవ సంఘ నేత తులసీయాదవ్‌ను హౌస్‌ అరెస్టు చేశారు.

ఏ చట్టం చెప్పింది!

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారితో పోలీసులు దారుణంగా వ్యవహరించారు. బలవంతంగా లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు, యాదవ సంఘం ప్రతినిధుల మొబైల్‌ ఫోన్‌లను గుంజుకున్నారు. అలాగే కవరేజ్‌కు వెళ్లిన సాక్షి రిపోర్టర్‌ ఫోన్‌ను సైతం లాక్కున్నారు. దీనిపై పలువురు న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. హత్య, కిడ్నాప్‌, లూఠీ వంటి నేరాలకు పాల్పడిన వారి నుంచి మాత్రమే ఫోన్లు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని వెల్లడిస్తున్నారు. గతంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి వ్యతిరేకంగా అలిపిరిలో నిరసన తెలిపినప్పుడు కూడా వైఎస్సార్‌సీపీ నేతల నుంచి దాదాపు 20 మొబైల్‌ ఫోన్లు లాక్కున్నట్లు సమాచారం. ఒక్కో ఫోన్‌ విలువ రూ.50వేల నుంచి రూ.1.5లక్షల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement