హత్య కేసులో నిందితులకు టీడీపీ నేత జేబీ మద్దతు సాక్షులను కిడ్నాప్ చేసి బెదిరించి.. నిందితులకు అనుకూలంగా వాంగ్మూలం జేబీ శ్రీనివాసులు ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన బాధిత మహిళలు కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి ఫొటోగ్రాఫర్, సోషల్ మీడియా రిపోర్టర్ సునీల్పై దాడి విచక్షణరహితంగా కొట్టి పోలీసులకు అప్పజెప్పి కట్టు కథలు జేబీ అనుచరులు ఇద్దరు కత్తులతోకోసుకుని, చేయి విరుచుకుని హై డ్రామా చివరకు బాధితులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై హత్యాయత్నం కేసులు నమోదు
సాక్షి టాస్క్ఫోర్స్: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో టీడీపీ అరాచకాలు అంతే లేకుండా పోయింది. హత్య కేసులో నిందితులను కాపాడేందుకు టీడీపీ నేత సాక్షులను కిడ్నాప్ చేసి.. అనుచరులకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించుకున్నారు. దీనిపై బాధిత మహిళలు నిరసన తెలుపుతుంటే కవరేజ్కు వెళ్లిన సాక్షి ఫొటో గ్రాఫర్, యూట్యూబ్ చానెల్ రిపోర్టర్, బాధితులకు అండగా నిలబడిన వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేశారు. ఆపై వారిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేయించిన ఘనత టీడీపీ నేత, పోలీసులకే చెల్లిందని ఆధ్యాత్మిక నగరం కోడై కూస్తోంది. తిరుపతిలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న హై డ్రామాపై సాక్షి ఫోకస్.
తిరుపతి కొర్లగుంటలో 2019 డిసెంబర్ 21న పసుపులేటి మురళి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఏ–1గా నరసింహులు, ఏ–2గా మల్లి సహా మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. తమిళనాడుకు చెందిన ఆరుగురు సుపారీ హంతకులను రంగంలోకి దించి హత్యకు పాల్పడ్డారని అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తిరుపతి నాలుగో అదనపు జిల్లా కోర్టులో విచారణలో ఉంది. కేసుకు సంబంధించిన సాక్షులను టీడీపీ నేత జేబీ శ్రీనివాసులు కిడ్నాప్ చేసి నిందితులకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించారని మృతుడి భార్య సత్య బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
జేబీ నివాసం ముందు మహిళల నిరసన
హత్య కేసులో నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్న టీడీపీ తిరుపతి ఇన్చార్జి జేబీ శ్రీనివాసులు నివాసం ఎదుట హతుడి భార్య సత్య, , బంధువులతో కలిసి గురువారం విషయం తెలుసుకున్న సాక్షి కెమెరామన్ మోహన్ కృష్ణ, స్థానిక యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ సునీల్, మరి కొందరు జేబీ నివాసం వద్దకు చేరుకున్నారు. వీడియోలు, ఫొటోలు తీస్తుండడం గమనించిన జేబీ అనుచరులు దాడులకు పాల్పడ్డారు.
హైడ్రామాకు పదును
కవరేజ్ కోసం వెళ్లిన విలేకరి సునీల్ను పోలీసులకు అప్పగించి ఎమ్మార్పల్లె పోలీస్టేషన్కు తరలించారు. అనంతరం మొత్తం ఘటనను వైఎస్సార్సీపీపైకి మళ్లించేందుకు ప్రణాళికలు రచించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, సాక్షి ఫొటో గ్రాఫర్, యూట్యూబ్ చానల్ రిపోర్టర్ కత్తులు, రాడ్లతో చొరబడి టీడీపీ నేత జేబీ శ్రీనివాసులుని హత్య చేసేందుకు యత్నించారని, అడ్డుకున్న వారిపై దాడి చేశారని నమ్మించేందుకు హై డ్రామాకు తెరతీశారు.
టీడీపీ కట్టు కథని నమ్మించేందుకు జేబీ శ్రీనివాసులు అనుచరులు రాఘవేంద్ర, లోకేష్, ప్రభు రంగంలోకి దిగారు. వారే కత్తితో చేయి కోసుకుని, మరొకరు చేయి విరుచుకుని గాయాలతో చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రిలో చేరారు. అయితే సునీల్ని పోలీసులు తీసుకెళ్లే సమయంలో పక్కనే జేబీ శ్రీనివాసులు, అనుచరులు ఉన్నారు. ఆ సమయంలో ఎవరికీ తగలని గాయాలు.. ఆ తర్వాత ఎలా తగిలాయాయో తిరుమల శ్రీవారికే తెలియాలి. ఈ క్రమంలో రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు.. వైఎస్సార్సీపీ నేత వాసుయాదవ్, యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ సునీల్, సుకుమార్, ప్రేమ్కుమార్, సాక్షి ఫొటో గ్రాఫర్ మోహన్కృష్ణపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పక్కాగా రికార్డులు తయారుచేసుకుని గురువారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. సునీల్, సుకుమార్, ప్రేమ్కుమార్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వాసుయాదవ్, మోహన్కృష్ణని అరెస్టు చేసి రహస్యంగా ఉంచారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.
అక్రమ కేసులో ముగ్గురికి రిమాండ్
సాక్షి టాస్క్ఫోర్స్ : టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్, ఆయన అనుచరుల అక్రమ ఫిర్యాదుతో సంజీవి సునీల్, మరో ముగ్గురు వ్యక్తులపై తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. దామినేడుకు చెందిన బి.రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్ నంబరు 290/2026 కింది ఎస్ఐ జ్యోతి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ కేసులో ఏ2గా ఉన్న సంజీవిసునీల్, ఏ3 సుకుమార్, ఏ4 ప్రేమ్కుమార్ను పోలీసులు శుక్రవారం రాత్రి న్యాయ స్థానంలో హాజరుపరచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అక్రమ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని, నాన్బెయిలబుల్ సెక్షన్ల కింద వారికి రిమాండ్ విధించేలా ఎఫ్ఐఆర్ రాసినట్టుగా వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కట్టుకథని నమ్మించేందుకు..


