తిరుపతి క్రైమ్ : తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును కేవలం 12 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి సుమారు రూ.12 లక్షల విలువైన 90 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.47 వేల నగదుతోపాటు నిందితుడు ఉపయోగించిన స్కూటీ, హత్యాయుధం స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సుబ్బరాయుడు వివరాలను వెల్లడించారు. ఎస్పీ కథనం మేరకు.. ఈ నెల 14వ తేదీన సాయినగర్ పంచాయతీ విజయనగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న ఎం. జ్యోతి (69) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. ఇంట్లోని సుమారు 90 గ్రాముల బంగారం, రూ.47 వేల నగదును నిందితుడు అపహరించి పరారయ్యాడు. దర్యాప్తులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడు గ్రామానికి పాశం రూపేష్ కుమా ర్ (36)ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. రైల్వే శాఖలో లోకో పైలట్గా కృష్ణపట్నం రైల్వే స్టేషన్న్లో రూపేష్కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. బాధిత కుటుంబంతో కొన్నేళ్లుగా ఉన్న పరిచయాన్ని అవకాశంగా మలుచుకుని, కుటుంబ పరిస్థితులపై అవగాహనతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు.
అప్పుల భారంతోనే నేరం
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కారణంగా బంగారు ఆభరణాలను దోచుకుని విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలని భావించిన నిందితుడు వృద్ధురాలిని లక్ష్యంగా ఎంచుకుని ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మారువేషంతో మోసం చేయాలనుకున్నా..
పోలీసుల దృష్టికి చిక్కకుండా ఉండేందుకు నిందితుడు పకడ్బందీగా ప్రణాళిక రచించాడు. తనతో పనిచేసే మరో లోకో పైలట్కు చెందిన స్కూటీని అపహరించి, దానికి నకిలీ నంబర్ ప్లేట్ అమర్చాడు. మహిళలు ధరించే నల్లని బురఖా, ముఖానికి స్కార్ఫ్, తలకు హెల్మెట్ ధరించి తిరుపతికి చేరుకున్నాడు. నేరం అనంతరం పలుమార్లు మార్గాలు మార్చుతూ సీసీ కెమెరాల నిఘా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.
సాంకేతిక విధానంలో దర్యాప్తు
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, డిజిటల్ ఆధారాలు, ఇతర శాసీ్త్రయ సాకా్ష్య్లను సమగ్రంగా విశ్లేషించారు. నిందితుడి ప్రతి కదలికను ప్రత్యేక బృందాలతో అనుసంధానం చేస్తూ దర్యాప్తు చేపట్టి, చివరకు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో రూపేష్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు, నేరానికి ఉపయోగించిన కత్తి, దొంగిలించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేక బృందాల కృషి
అడిషనల్ ఎస్పీలు ఆర్ల శ్రీనివాసులు, కె. రవిమనోహరాచారి ఆధ్వర్యంలో చంద్రగిరి ఎస్డీపీఓ ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఈ కేసును దర్యాప్తు చేశాయి. తిరుపతి రూరల్ ఇన్న్స్పెక్టర్ కె.మద్దయ్యాచారి, సీసీఎస్ ఇన్న్స్పెక్టర్లు శివకుమార్ రెడ్డి, టి.అబ్బన్న, ఎస్ఐలు పి.శ్రీరాములు, జ్యోతి, నాగార్జున రెడ్డి, చిరంజీవి, ఐడీ పార్టీ సిబ్బంది లక్ష్మీ ప్రసాద్, గౌస్ అరీఫ్, సూర్య ప్రసాద్, ప్రభాకర్, ప్రసాద్, శ్రీనివాసులు, రమే ష్, నాగరాజు శెట్టి, మురళి సమన్వయంతో పనిచేసి కేసును విజయవంతంగా ఛేదించారు.
చట్టం నుంచి తప్పించుకోలేరు : ఎస్పీ
ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ నేరం చేసి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి అభినందనలు తెలిపారు.


