నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ శ్రీప్రకాష్ పాఠశాలలో రెండురోజులుగా కొనసాగుతున్న సీబీఎస్ఈ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఆదివారం ఉదయం మ్యాచ్లను పాఠశాల డైరెక్టర్ విజయ్ప్రకాష్ ప్రారంభించారు. అండర్–14, 17, 19 బాలుర విభాగాల్లో మొత్తం 54 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్యార్టర్ ఫైనల్స్ విభాగంలో ప్రతిభ చూపిన ప్రతి విభాగంలోని 4 జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. అండర్–14 విభాగంలో గ్రీన్ సిటీ ఇంగ్లీష్ మీడియం (విశాఖ), డాక్టర్ కేఎల్ ప్రసాద్ స్కూల్ (గుంటూరు), గాడియం స్కూల్ (హైదరాబాద్), సర్ సీఆర్ రెడ్డి స్కూల్ (ఏలూరు) సెమీస్కు చేరుకున్నాయి. అండర్–17 విభాగలో గాడియం స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్, మౌంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ (కర్నూలు), భారతీయ విద్యాభవన్ స్కూళ్లు సెమీస్లో స్థానం పొందాయి. అండర్–19 విభాగంలో శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ (పెద్దాపురం), ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ (కాకినాడ), పల్లవి మోడల్ స్కూల్ (అల్వాల్), బీవీవీ వెంకటేశ్వర స్కూల్(తిరుపతి) సెమీస్కు చేరారు. ఈ పోటలను టెక్నికల్ అడ్వైజర్ బృందం పర్యవేక్షించగా, రిఫరీలు శ్రీనివాస్, సాయిబాబు, పరమేశ్వరరావు, డి.శ్రీనివాస్ పోటీల నిర్వహణలో సహకారం అందించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్టు విద్యా సంస్థల ప్రతినిధి పి.రామకృష్ణ తెలిపారు.


