కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలు ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ వేలాదిగా తరలివచ్చిన వర్కర్లు, హెల్పర్లు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నేతలు
తిరుపతి అర్బన్: ‘అనవసరమైన యాప్లతో పనిభారం పెంచారు. నవచేతన యాప్తో నరకం చూపిస్తున్నారు. ఎన్నికల ముందు వచ్చిన హామీలు మాత్రం గుర్తుకు రావడం లేదు. రెండేళ్లకుపైగా అవుతున్నా పైసా జీతం కూడా పెంచలేదు. ఇలాగే కొనసాగితే ఉద్యమాలు తప్పవు’ అని అంగన్వాడీ వర్కర్లు హెచ్చరించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు కందారపు మురళి, అంగన్వాడీ జిల్లా నేతలు పద్మలీల, రాజేశ్వరి, వాణిశ్రీ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.సుబ్రమణ్యం, ఎస్.జయచంద్ర, జి.బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పలువురు నల్ల చీరలు కట్టుకొచ్చి నాలుగు గంటల పాటు నిరసన తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీలేమయ్యాయి బాబూ
పలువురు వర్కర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనాయి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్కల్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంగ్వాడీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి.. పవర్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31న మరోసారి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. అంగన్వాడీ, సీఐటీయూ నేతలు బుజ్జి, చంద్రశేఖర్, వేణుగోపాల్, లక్ష్మి, మునిరాజా, రమేష్, స్వరూపారాణి, రమాదేవి, పుష్ప, ధనమ్మ, రాజేశ్వరి, హైమావతి, వసంత పాల్గొన్నారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు.


