తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చొరవతో మోక్షం లభించనుంది. గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం ఆయన చేసిన నిరంతర కృషికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎంపీ ప్రతిపాదించిన రహదారి పనులకు గతంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు తన సమ్మతిని తెలియజేస్తూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తక్షణ ఆమోదం పొందేలా చర్యలు తీసుకున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నాలుగు గ్రామీణ రహదారి పనులకు రూ.4.99 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపినట్లు శుక్రవారం ఎంపీకి లేఖ ద్వారా తెలియజేశారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారులు నిర్మించనున్నారు.
ఆమోదం పొందిన రహదారి పనులు
చిల్లకూరు మండలం : తీగపాళెం పీఆర్ రోడ్డు నుంచి పల్లివానిదిబ్బ వరకు – 1.28 కి.మీ (రూ.1.51 కోట్లు)
డక్కిలి మండలం: మోపూరు రోడ్డు నుంచి ఎం.వెల్లంపల్లి వరకు – 1.28 కి.మీ (రూ.1.39 కోట్లు)
సత్యవేడు మండలం: తడ–సత్యవేడు రోడ్డు నుంచి వానెల్లూరు గ్రామం వరకు – 1.05 కి.మీ (రూ.1.04 కోట్లు)
శ్రీకాళహస్తి మండలం: శ్రీకాళహస్తి–ముసలిపేడు రోడ్డు నుంచి వేడం పెద్దమిట్టకండ్రిగ వరకు – 1.04 కి.మీ (రూ.1.05 కోట్లు)


