తిరుమల: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ‘డీమ్డ్ టు బీ యూనివర్సిటీ’ హోదా అనుమతి పత్రాన్ని విద్యావేత్త, మాజీ మంత్రి డాక్టర్ మల్లారెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో తిరుపతిలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్న తన సంకల్పం సాకారమైందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. గత ఏడాది సెప్టెంబర్ 9న తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమలకు వచ్చి, తిరుపతిలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని శ్రీవారిని ప్రార్థించానని తెలిపారు. ఏడాది పూర్తిగాకముందే కేంద్ర ప్రభుత్వం డీమ్డ్ యూనివర్సిటీ హోదా మంజూరు చేయడం శ్రీవారి కృపేనని అన్నారు. తిరుపతి విమానాశ్రయం సమీపంలోని పాత శ్రీ కళాశాల భవనాలు, స్థలాన్ని సేకరించి అత్యాధునిక సౌకర్యాలతో మల్లారెడ్డి యూనివర్సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ నలుమూలల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థిని కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో నైపుణ్యం కలిగిన నిపుణుడిగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విద్యా విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు.


