– ఎస్సీ కమిషన్ చైర్మన్
తిరుపతి అర్బన్: ఎస్సీలపై దాడులు జిల్లాలో తగ్గుతున్నాయని, అలాగే వివక్షపూరిత ఘటనలు తక్కువగానే ఉన్నాయని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహార్ వెల్లడించారు. గురువారం కలెక్టరేట్కు విచ్చేసిన ఆయన ఉదయం పీజీఆర్ఎస్ హాల్లో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 105 అర్జీలను అందుకున్నారు. మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులతో కలసి పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఎస్సీల పాలన సమర్థవంతంగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వివక్ష తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 68 కేసులు పెండింగ్లో ఉన్నాయని, అందులో 18 కేసులు అట్రాసిటీ కేసులు ఉన్నారని వెల్లడించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. అయితే భూ సమస్యలపై వచ్చే అర్జీల్లో కోర్టు కేసులు ఉండే అంశాలు మాత్రమే జాప్యం జరుగుతుందని చెప్పారు. జేసీ గోవిందరావు మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్నరాయుడు మాట్లాడుతూ పోలీస్స్టేషన్కు వచ్చే అర్జీదారులతో మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు.
పోలీసులపై చర్యలు తీసుకోండి
నా భర్త జడ వేమయ్యను వెంకటగిరి పోలీసులు అన్యాయంగా కొట్టారని ఆయన భార్య జడ నందిని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహార్కు గురువారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వెంకటగిరి మండలం పాలకొండసత్రం అరుంధతివాడ గ్రామానికి చెందిన జడ వేమయ్యను ఈ ఏడాది మార్చి 24వ తేదిన వెంకటగిరి పోలీస్స్టేషన్ నుంచి పోన్ చేసి స్టేషన్కు పిలిపించి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు.
స్విమ్స్ సమస్యలకు పరిష్కారం చూపండి
స్విమ్స్లో దళిత, బడుగు బలహీనవర్గాల కార్మికులకు చెందిన సమస్యలకు పరిష్కారం చూపాలని సీఐటీయూ నగర ఉపాధ్యాక్షుడు వేణుగోపాల్, స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మారి ముత్తు, నాయకులు గోపి, వెంకటేష్, మునేంద్ర, మునికృష్ణ ఎస్సీ కమీషన్కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఓ వినతిపత్రం అందజేశారు.
రూ.లక్షలు చెల్లించాం..ప్లాట్లు చూపలేదు
నెలవారీ కంతుల రూపంలో రూ.లక్షలు చెల్లించామని, అయినా ఇప్పటి వరకు ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయలేదని ఎరుకల దేవాంజనేయులుతోపాటు పలువురు బాధితులు ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహార్కు ఫిర్యాదు చేశారు. 1998–2000లో చరిష్మా హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి వందలాది మంది పేదలు ఇంటి ప్లాట్ కోసం డబ్బులు చెల్లించామని పేర్కొన్నారు. అయితే ఆ భూములు 22ఏ కింద ఉన్నాయంటూ సంస్థ డైరెక్టర్లు కాలయాపన చేస్తున్నారని చెప్పారు.


