సూళ్లూరుపేట:మండలంలోని మన్నేముత్తేరిలో బాల సుందర్రాజ్ అనే పాస్టర్ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి రూ.8 లక్షల నగదు, 8 సవర్లు బంగారు నగలు చోరీ చేశారు. బాధితుడు బాలసుందర్ రాజ్ కథనం మేరకు.. చైన్నెలోని బాలసుందర్ రాజ్ మనవడి పుట్టిన రోజు పండుగకు కుటుంబ సభ్యులందరూ బుధవారం ఇంటికి తాళాలు వేసుకుని చైన్నెకి వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించి దండగులు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బెడ్రూమ్లోని బీరువాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 8 లక్షల నగదు, 8 సవర్లు బంగారు నగలు చోరీ చేశారు. గురువారం ఉదయాన్నే చర్చి తాళాలు తీసేందుకు వచ్చిన వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి బాలసుందర్రాజ్కు సమాచారం అందించారు. ఆయన వెంటనే చైన్నె నుంచి వచ్చి చూసుకుని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మురళీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సంఘటన స్థలంలో వేలిముద్రలను సేకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.
జూనియర్ సివిల్ జడ్జిగా మహిళా యూనివర్సిటీ విద్యార్థిని
తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగానికి చెందిన విద్యార్థిని స్వర్ణ సుష్మా జూనియర్ సివిల్ జడ్జిగా (న్యాయమూర్తిగా) ఎంపిక కావడంపై వర్సిటీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయమూర్తి స్వర్ణసుష్మాను న్యాయ విభాగం, వర్సిటీ అధికారులు గురువారం ఘనంగా సన్మానించారు. ఆమె సాధించిన విజయంతో విశ్వవిద్యాలయం ప్రతిష్ట మరింత పెరిగిందని వీసీ ఆచార్య ఉమ కొనియాడారు. స్వర్ణ సుష్మా 2019–2022 బ్యాచ్లో మూడేళ్ల లా కోర్సును పూర్తి చేసి, ప్రస్తుతం ఇక్కడే ఎల్ఎల్ఎం (పీజీ కోర్సు) ఫైనల్ ఇయర్ చదువుతోందని, ఇంతలో న్యాయమూర్తుల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసి పరీక్షలు రాసిన తరువాత అన్ని రకాల ఇంటర్వూల్లో విజయం సాధించి ఆమె న్యాయమూర్తిగా ఎంపికయ్యారని వర్సిటీ అధికారులు తెలిపారు.
మహిళ మృతిపై
డీఎంహెచ్ఓ విచారణ
కలువాయి(సైదాపురం):కలువాయి పీహచ్సీలో సిబ్బంది లేని కారణంగా మహిళ మృతి చెందడంపై డీఎంహెచ్ఓ విచారణ జరిపారు. ఈ నెల 8వ తేదీ తెల్లవారుజమున పెన్నబద్దెవోలు గ్రామానికి చెందిన మందాల పెంచలమ్మను 108 వాహనంలో కలువాయి పీహెచ్సీకి తీసుకుని వచ్చే సరికి ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవరు లేకపోవడంతో అక్కడ నుంచి పొదలకూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళుతుండగా మార్గం మధ్యలో ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించగా గురువారం నెల్లూరు డీఎంహెచ్ఓ సుజాత చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన పెంచలమ్మ మృతిపై వైద్యులు విజయలక్ష్మి, వైద్యశాల సిబ్బంది, 108 వాహనం సిబ్బందిని విచారించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని హెచ్చరించారు. తీరు మారకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.


