తిరుపతి రూరల్: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనులకు విశేష సమర్పణ చేశారు. ఆ తరువాత ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు సమర్పించిన పట్టు వస్త్రాలతో ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఉగాది రోజున నిర్వహించే పంచాంగ శ్రవణం సర్వకార్య శుభఫల ప్రదాయకమని, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు అన్ని కార్యాల్లో శుభాలు కలగాలని చెవిరెడ్డి దంపతులు మొక్కుకున్నారు. చెవిరెడ్డితోపాటు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్రెడ్డి మాట్లాడారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


