శ్రీసిటీ (వరదయ్యపాళెం): ముంబైలో ఈ నెల 12వ తేదీ నుంచి జరుగుతున్న ‘ఏసీఆర్ఈఎక్స్ ఇండియా 2026’ ఎగ్జిబిషన్లో ‘కూల్ సిటీ’గా శ్రీసిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. శ్రీసిటీలోని పలు ప్రముఖ ఏసీ కంపెనీలు, ఇతర అనుబంధ పరిశ్రమలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. హెచ్వీఏసీ అండ్ఆర్ (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్) తయారీ కేంద్రంగా శ్రీసిటీ ప్రాధాన్యతను చాటింది. దక్షిణ ఆసియాలో హెచ్వీఏసీ అండ్ ఆర్ రంగానికి సంబంధించిన ప్రముఖ ఎగ్జిబిషన్గా గుర్తింపు పొందిన ‘ఏసీఆర్ఈఎక్స్ ఇండియా 2026’ని ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజినీర్స్ (ఐఎస్హెచ్ఆర్ఏఈ) అనే సంస్థ నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్త తయారీ సంస్థలు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు, పరిశ్రమ ప్రముఖులు తమ అత్యాధునిక సాంకేతికతలు, పర్యావరణహిత పరిష్కారాలు, భవిష్యత్తు వ్యవస్థ మార్పులను పరిచయం చేయడానికి ఇదొక మంచి వేదికగా నిలుస్తోంది. దీనిపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రసన్నారెడ్డి స్పందిస్తూ, శ్రీసిటీలోని హెచ్వీఏసీ పారిశ్రామిక అనుకూల వాతావరణ ప్రదర్శనతో పాటు పరిశ్రమల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో తయారయ్యే ఎయిర్కండిషనర్లలో దాదాపు 40 శాతం శ్రీసిటీలోనే తయారవుతున్నాయని తెలిపారు.


