తిరుపతి తుడా: వైద్యాధికారుల నిర్లక్ష్యంతో ఓ నవజాత శిశువు మృతి చెందిన ఘటన తిరుపతిలో కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు వైద్యు ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. బుధవారం ఉదయం ప్రసవ నొప్పులతో బాధపడుతున్న తిరుపతి మారుతీనగర్కు చెందిన ఓ గర్భిణిని కుటుంబ సభ్యులు తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు మధ్యా హ్నం ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అనంతరం మహిళకు రక్తపోటు పెరగడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. గురువారం సాయంత్రం శిశువుకు వైద్యులు ఇంజెక్షన్ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆ ఇంజెక్షన్ వికటించడంతో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో శిశువు మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారు. బిడ్డ మృతి చెందడంపై వైద్యాధికారులు సరైన వివరణ ఇవ్వకుండా పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
శిశువు మృతదేహంతో నిరసన
శిశువు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట కుటుంబ స భ్యులు నిరసన చేపట్టారు. నిర్లక్ష్యం వహించిన వై ద్యాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డి మాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


