తిరుపతి రూరల్: వేసవిలోనూ నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్లోతేటి సూచించారు. తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం సంస్థ పరిధిలో చీఫ్ ఇంజినీర్ స్థాయి నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ స్థాయి వరకు హాజరైన అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు మెరుగైన, సత్వర సేవలను అందించేందుకు సంసిద్ధులు కావాలన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనితీరుపై ఇంకా ఫిర్యాదులు అందుతున్నాయని, సిబ్బంది పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. పీఎం–సూర్యఘర్ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
స్కాలర్ షిప్లు విడుదల చేయాలి
తిరుపతి కల్చరల్: నర్సింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్ర భుత్వం స్కాలర్షిప్ను మంజూరుతోపాటు క్లినికల్ ఆఫిలియేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఇనిస్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు పాల్గొని, నర్సింగ్ కళాశాలలు, పాఠశాలలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్రావు, జిల్లా అధ్యక్షుడు వై.ప్రవీణ్, కార్యదర్శి రాకేష్ కిరణ్, కోశాధికారి విజయభాస్కర్, చీఫ్ పాట్రన్ శివరామరాజు, రమణారెడ్డి ,ఎంసెట్ మల్లిఖార్జున పాల్గొన్నారు.


