పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పోరాటం ఇప్పటికీ అట్టడుగు వర్గాల్లోనూ చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. రైతుల ఆక్రందనలపై గళమెత్తారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా నిలిచారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం చేసిన కుట్రలను దీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజా సమస్యలను విని, విజయానికి చేరువయ్యారు.


