రేపటి నుంచి ‘సిద్ధార్థ’ సిల్వర్ జూబ్లీ వేడుకలు
తిరుపతి కల్చరల్: సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వేడుకగా చేపడుతున్నట్లు ఆ కళాశాల చైర్మన్ కె.అశోక్ రాజు తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న విద్యార్థులు వ్యర్థ వస్తువులతో తయారుచేసిన రోబో లు, గన్స్, హెలికాప్టర్ వంటి సుమారు 65 వస్తువులను ప్రదర్శన ఉంటుందన్నారు. 30న కళాశాలలోని అన్ని విభాగాల వర్క్షాపు, 31న ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థుల ప్రాజెక్టు ఎగ్జిబిషన్, ఫిబ్రవరి 1న 24 గంటల పాటు హ్యాకథాన్ పేరుతో 1,750 డెలిగేట్ల వివిధ అపరిష్కృత సమస్యల పరిష్కార మార్గాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో సమస్య పరిష్కారాలు చూపిన వారికి రూ.3.50లక్షలను బహుమతిగా ఇస్తామని వెల్లడించారుు. 2న అన్ని విభాగాల కార్యక్రమాల నిర్వహణ, 3న నైపుణ్యాలపై పత్రాలు సమర్పణ, 4న మన సంస్కృతి,సాంప్రదాయాలు తెలిపేలా ప్రముఖ ప్రవచనకర్త ప్రసంగం, 5న పేరెంట్స్ డే, 6న స్పోర్ట్స్ డే, 7న తమ విద్యాసంస్థ పూర్వ విద్యార్థులతో జూనియర్లకు ఆన్లైన్ తరగతుల, 8న సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు. కళాశాల వేడుకలకు సినీ నటి మీనాక్షి చౌదరి, సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరి వంటి అద్భుత కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
గంగ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం
తొట్టంబేడు : తెలుగుగంగ కాలువలో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనబడింది. తొట్టంబేడు మండలంలోని కల్లిపూడి గ్రామానికి సమీపంలోని తెలుగంగ కాలువ సబ్ కెనాల్ గేట్ల వద్ద ఓ మహిళ మృతదేహం కాలువ నీటిలో కొట్టుకుంటూ పోతోందని గమనించిన గ్రామస్తులు ఎస్ఐ బాలకృష్ణకు తెలియజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి చెందిన మహిళ వయసు 55 ఏళ్లు ఉంటుందని, ఆమె వద్ద శ్రీకాళహస్తి పట్టణంలోని మాధురి గోల్డ్ సంస్థ పర్సు ఒకటి ఉందని, అందు 460 రూపాయల నగదు కూడా ఉందని తెలిపారు. ఒక్కో చేతికి ఒక్కో ఇత్తడి రంగు గాజు, చెవులకు బంగారు వర్ణం కమ్మలు ఉన్నట్టు గుర్తించారు. మృతురాలి ఆచూకీ తెలిసినవారు. బుచ్చినాయుడు కండ్రిగ సీఐ 9440796763, ఎస్ఐ 9440900724 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
పోలీసుల అవినీతిపై ఏసీబీ దర్యాప్తు
నాయుడుపేటటౌన్ : పట్టణంలోని అర్బన్ సీఐ బాబీ, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్రాజు అవినీతిపై ఏసీబీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా సీఐ అవినీతి చిట్టాను పూర్తిస్థాయిలో వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ మల్లికార్జున సోమవారం సాయంత్రం నాయుడుపేటలోని సీఐ బాబీ, హెడ్కానిస్టేబుల్ రామ్మోహన్ ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వర వైన్షాపు నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు సీఐ, హెడ్కానిస్టేబుల్ను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్న విషయం విధితమే. ఈ క్రమంలోనే అవినీతి పోలీసుల అక్రమాస్తులను లెక్కగట్టేందుకు ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిందితుల ఇళ్లలోని నగదు, బంగారు నగలు సైతం స్వాధీనం చేసకుని వివరాలను నమోదు చేస్తున్నారు. సీఐ బాబీకి సంబంధించి నెల్లూరు, ఆయన స్వగ్రామమైన మాచర్ల తదితర ప్రాంతాల్లో కూడ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నిందితులను రిమాండ్కు పంపనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
రేపటి నుంచి ‘సిద్ధార్థ’ సిల్వర్ జూబ్లీ వేడుకలు


