
వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీపై అవగాహన
తిరుపతి సిటీ : నగరంలోని సీకామ్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీపై ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ ఇనేష్ సిద్ధార్థ అవగాహన కల్పించారు. బుధవారం ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బేసిక్స్, మాక్రో ఫొటోగ్రఫీ, ప్రొడక్ట్ ఫొటో గ్రఫీ, ఫుడ్ ఫొటోగ్రఫీ, న్యూబార్న్ ఫొటోగ్రఫీ తదితర అంశాల్లో మెలకువలను నేర్పించారు.
దివ్యాంగులకు ఉచిత శిక్షణ
తిరుపతి అర్బన్ : జిల్లాలోని నిరుద్యోగ దివ్యాంగ యువతకు ఉచితంగా కంప్యూటర్ , కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇస్తామని యూత్ 4 జాబ్స్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు మీరా షైనీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం వరకు అవకాశం ఉందని ఆసక్తి ఉన్నవారు హాజరు కావాలని కోరారు. ప్రధానంగా శారీరక దివ్యాంగులు, మూగ, చెవుడు లోపాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా చేసిన వారు 19–34 ఏళ్ల వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9347411952, 93929 23884 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
పది మంది ఆటో డ్రైవర్లకు జైలు
తిరుపతి లీగల్ : అధిక మోతాదులో మద్యం తాగి తిరుపతిలో నిర్లక్ష్యంగా ఆటోలు నడుపుతున్న పది మంది డ్రైవర్లకు ఒక్కొక్కరికి మూడు రోజులు చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి ట్రాఫిక్ పోలీసులు నగరంలో తనిఖీలు నిర్వహించారు. అలాగే స్వల్ప మోతాదులో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 11 మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
రేపు జర్మన్ భాషపై
శిక్షణ ప్రారంభం
తిరుపతి అర్బన్ : జర్మన్ భాషపై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం తిరుపతిలోని శ్రీబాబు జగ్జీవన్ భవనంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తున్నట్లు బుధవారం ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి విక్రమకుమార్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలావీరాంజనేయస్వామి, సాంఘికశాఖ సంచాలకులు లావణ్య వేణి హాజరు కానున్నారని చెప్పారు. ఎస్సీలు 25 మంది, ఎస్టీలు 25 మంది మహిళలకు ఉచిత వసతితో పాటు జర్మన్ భాషపై శిక్షణ ఉంటుందని చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖతో పాటు గిరిజన సంక్షేమశాఖ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వివరించారు.
ఆటో చోరీ కేసులో జైలు
తిరుపతి లీగల్: ఆటో చోరీ కేసులో వైఎస్సార్ కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, తుమ్మలూరుకు చెందిన అనిల్కుమార్కు రెండు నెలల జైలు శిక్ష, వంద రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు బుధవారం తీర్పు చెప్పారు. ఈ ఏడాది మే 22వ తేదీ తిరుపతి, గాంధీపురం, జగ్జీవన్ రావు పాఠశాల వద్ద కిషోర్ కుమార్ తన ఆటోను నిలిపాడు. మరుసటి రోజు వెళ్లి చూడగా ఆటో కనపడలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడు అనిల్ కుమార్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కేసు పరిశీలించిన న్యాయమూర్తి అనిల్ కుమార్కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
నాగలాపురం: మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది కూట మి నేతలు అధికారం అండతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నాగలాపురం మండలంలోని చిన్నాపట్టు వద్దనున్న అరణియార్ నదిలో మంగళవారం అర్ధరాత్రి ఇసుక తవ్వకాలు చేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వారు వెంటనే అక్కడికి చేరుకుని దాడి చేశారు. మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. తర్వాత ఏమి జరిగిందో కాని కేసులు నమోదు చేయకుండా యజమానులకు నామమాత్రంగా జరిమానా విధించి ట్రాక్టర్లను వదిలేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే ట్రాక్టర్లను వదిలేశారని, జిల్లా ఉన్నతాధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.