
ఫిలింనగర్లో యువతి అదృశ్యం
ఫిలింనగర్(హైదరాబాద్): తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒక్కదానికే బోర్ కొడుతోంది.. ఉండలేకపోతున్నా అని తరచూ స్నేహితురాలికి చెబుతూ బాధపడుతున్న ఓ యువతి అదృశ్యమైంది.ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్లోని మహాత్మాగాంధీనగర్ బస్తీలో నివసించే చంద్రయ్య, రేఖ దంపతులకు వసంత (19) అనే కూతురు ఉంది.
ఏడో తరగతి చదువుకున్న వసంత తల్లిదండ్రులిద్దరూ పనులకు వెళ్తుండడంతో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఇంట్లో బోర్ కొడుతుందంటూ ఎప్పుడూ స్నేహితురాలితో బాధపడేది. ఈ నేపథ్యంలోనే తాను బయటకు పని మీద వెళ్తున్నానని చెబుతూ తన చిన్నమ్మకు చెప్పి వెళ్లిపోయింది. ఇంటికి వచ్చి చూసిన తల్లిదండ్రులకు కూతురు కనిపించకపోయేసరికి అన్ని ప్రాంతాలు గాలించారు. ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉండగా చంద్రయ్య అన్న కొడుకు విజయ్తో తమకు కొంతకాలంగా గొడవలు ఉన్నాయని, తమ కూతురు అదృశ్యం వెనుక విజయ్ హస్తం ఉండి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 8712569163 నెంబర్లో సంప్రదించాలిన పోలీసులు కోరారు.