
ప్రపంచంలోనే తొలిసారిగా గరిష్ట ఉష్ణోగ్రతను తట్టుకొనే కంది వంగడాన్ని అభివృద్ధి చేసిన ఇక్రిశాట్..
125 రోజుల్లో చేతికందే ఐసీపీవీ 25444 రకం
కంది పంట.. హెక్టార్కు 2 టన్నుల దిగుబడి
సాక్షి, హైదరాబాద్: గరిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకొని.. హెక్టార్కు 2 టన్నుల దిగుబడిని ఇచ్చే కంది వంగడాన్ని ఐసీపీవీ 25444 పేరుతో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది. కేవలం 125 రోజుల్లో పంట చేతికి వచ్చే ఈ వంగడాన్ని ఖరీఫ్, రబీలో ఎప్పుడైనా సాగు చేయొచ్చు. కేవలం రెండున్నర అడుగులు మాత్రమే పెరిగే ఈ కందిని మిషన్ ద్వారా కోయొచ్చు.
కూలీల సమస్య, ఎరువుల అవసరం తగ్గుతుంది. ఈ మేరకు ఇక్రిశాట్ అధికారులు సోమవారం హైదరాబాద్ నుంచి మీడియాను పటాన్చెరులో సంస్థ అభివృద్ధి చేసిన ఐసీపీవీ 25444 రకం కంది చేల దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్, ప్రోగ్రాం డైరెక్టర్ షాన్ మైట్స్, లీడ్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాష్ గంగశెట్టి, అసోసియేట్ సైంటిస్ట్ డాక్టర్ శ్రుతి బెలియప్ప తదితరులు ఐసీపీవీ 25444 కంది వంగడం గురించి వివరించారు.
అత్యధిక వేడిని తట్టుకునే పంట
కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఐసీపీవీ 25444 వంగడాన్ని విజయవంతంగా పరీక్షించామన్నారు. 2021లో దీనికోసం ప్రయత్నాలు ప్రారంభించి, 2024 నాటికి స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో పూర్తి చేశామని తెలిపారు. కొత్త రకాన్ని అభివృద్ధి చేయడానికి అయ్యే 15 సంవత్సరాల పనిని కేవలం ఐదేళ్లలో పూర్తి చేసినట్టు వివరించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కందిపప్పుకు ఒక కొత్త దశను తీసుకొచ్చే అద్భుత ఆవిష్కరణగా వారు పేర్కొన్నారు.
దేశీయ పప్పుదినుసుల లోటును తీర్చే శుభవార్త
భారత్లో కందిపప్పు వినియోగం 5 మిలియన్ టన్నులుగా ఉండగా, దేశీయంగా 3.5 మిలియన్ టన్నుల కందిపప్పు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని లీడ్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాశ్ గంగశెట్టి తెలిపారు, దేశ అవసరాలకు మరో 1.5 మిలియన్ టన్నులు అవసరం కాగా, ఇందుకోసం సంవత్సరానికి రూ. 6,700 కోట్ల దిగుమతుల భారం పడుతోందని తెలిపారు. ఇక్రిశాట్ ద్వారా అభివృద్ధి చేసిన ఐసీపీవీ 25444 వంగడంతో ఈ లోటు తీరే అవకాశముందన్నారు. తాండూరు, వికారాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంటకు అనుకూలమని చెప్పారు.
భారత్తో పాటు ఇతర దేశాల్లో కూడా...
భారత్తోపాటు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఈక్వడార్ దేశాల్లోనూ ఈ కందిని ఉత్పత్తికి వినియోగించేందుకు అవకాశముందని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ స్థిరత్వ పంటగా ఐసీపీవి 25444కి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచే శక్తి ఉందన్నారు.