TS: Why Is The Center Discriminating Against Telangana, details inside - Sakshi
Sakshi News home page

తెలంగాణపై కేంద్రానికి ఎందుకు వివక్ష? 

Feb 1 2022 9:01 AM | Updated on Feb 1 2022 11:12 AM

Why Is The Center Discriminating Against Telangana - Sakshi

వర్చువల్‌గా జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు

సాక్షి, న్యూఢిల్లీ: ‘తెలంగాణ పట్ల కేంద్రానికి ఎం దుకు వివక్ష? రాష్ట్రాన్ని ఎందుకు శత్రువులా చూస్తున్నారు, ఎందుకు విరోధం పెంచుకుంటున్నారు’ అని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించి విభజన సమస్యలను పరిష్కరించడంలో ఎనిమిదేళ్లుగా ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. సోమవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్‌ అంశాలను వీరిద్దరూ లేవనెత్తారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్కప్రాజెక్టులో కూడా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. దేశంలో అనేక మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నా తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.  '

ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులా?
పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులను రాష్ట్రాలకు ఎందుకు విడుదల చేయట్లేదో తెలపాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. వరి ధాన్యం సేకరణలో జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని తీసుకురావాలని కోరారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నాయన్నారు. ఇప్పుడు ప్రివిలేజ్‌ కమిటీ రూపంలో పార్లమెంట్‌ను కూడా వాడుకుంటున్నారని విమర్శించారు.  కేంద్ర విచారణ సంస్థలను  కేంద్రం తన అవసరాలకు వీటిని ఉపయోగించవద్దని పేర్కొన్నారు. ( చదవండి: India Budget 2022-23 Highlights )

పెగసస్‌పై చర్చ జరగాలి 
పెగసస్‌ స్పైవేర్‌ సమస్య వంటి జాతీయ భద్రత అంశంతోపాటు ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని కేకే తెలిపారు. దేశంలో  ఉపాధి కల్పనకు కేంద్రం చర్యలు తీసుకోవట్లేదని నామా విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభవృద్ధి కోసం కేం ద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లు చెల్లించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందనలేదన్నారు. కాగా సోమవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ఉభ య సభలను ఉద్దేశించి జరిగిన రాష్ట్రపతి ప్రసంగానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు హాజరు కాలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement