
సాక్షి, వరంగల్: రీల్స్ కలిపిన ప్రేమ.. పండంటి కాపురంలో చిచ్చు రాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేసు వివరాల్లోకి వెళ్తే..
స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ప్రత్యూష.. హసన్పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతితో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సృజన్ కార్డియాలజీ డాక్టర్గా పని చేస్తున్నారు. మరో ఆస్పత్రిలో ప్రత్యూష డెంటిస్ట్గా పని చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి.. డాక్టర్ సృజన్ను ఆ మధ్య ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్గా చేసి ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం ప్రేమగా మారింది.
ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో.. పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. అయినా సృజన్లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇలా ఘాతుకానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్ను, ఆ యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.