ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ

Vote For Note Case Have All Evidence To Prove: ACB - Sakshi

డిశ్చార్జ్‌ పిటిషన్లు కొట్టివేయండి

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసును నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో నిందితుల డిశ్చార్జ్‌ పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ స్పెషల్‌ పీపీ సురేందర్‌రావు ప్రత్యేక కోర్టుకు నివేదించారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఓటు కోసం ప్రలోభపెట్టిన కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లను న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు మంగళవారం విచారించారు. కుట్రలో నిందితుల పాత్ర ఉందనేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు.  (తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు నోటీసులు)

రేవంత్‌రెడ్డితో కలసి వీరంతా ఈ కుట్రలో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. మరో నిందితుడు ఉదయసింహ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి నుంచి రూ.50 లక్షల నగదు తెచ్చారని వివరించారు. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన డబ్బు తెచ్చారని, స్టీఫెన్‌సన్‌ ఇంటికి తెచ్చి ఇచ్చింది కూడా ఉదయసింహనే అని పేర్కొన్నారు. డిశ్చార్జ్‌ పిటిషన్లను కొట్టివేయాలంటూ అన్ని ఆధారాలతో కౌంటర్లు దాఖలు చేశామని, ఈ నేపథ్యంలో వారి పిటిషన్లు కొట్టివేసి నిందితులపై అభియోగాలను నమోదు చేయాలని సురేందర్‌రావు నివేదించగా, ఈ కేసులో నిందితుల తరఫున వాదనలు వినేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top