హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్రం కావాలనే సీఎం పర్యటనను అడ్డుకుందని చెప్పారు. బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ దీనిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సీఎం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణకు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను తీసుకురావడం, విద్యా రంగంలో పెట్టుబడులు, అత్యుత్తమ విద్యా సంస్థల భాగస్వామ్యాలను రాష్ట్రానికి తీసుకురావడం వంటి అంశాలపై చర్చించాలన్నది సీఎం లక్ష్యమని పేర్కొన్నారు.
అమెరికా పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించినప్పటికీ, రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం దురదృష్టకరమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలను కూడా రాజకీయాలకు అతీతంగా చూడలేని స్థాయికి బీజేపీ దిగజారిందని విమర్శించారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచస్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణలోని బడుగు, బలహీన, దళిత, మైనార్టీ వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలు కల్పించేందుకు సీఎం వెళ్తే మాత్రం అడ్డంకులు సృష్టిస్తారా?” అని నిలదీశారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ అవగాహన మరోసారి బహిర్గతమైందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణను చూసి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.


