
హైదరాబాద్: హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసనా కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టిసారిస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై కొన్ని అపోహలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రచారం ముమ్మరంగా చేస్తారు.
మొత్తం 1.5 లక్షల మంది మహిళలకు చేరుకునే విధంగా దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం నిర్వహిస్తారు. నిర్మాణాత్మక సమాజ భాగస్వామ్యం, ఆరోగ్య ముప్పు అంచనాలతో శిక్షణ పొందిన క్షేత్రస్థాయి సిబ్బంది ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని అపోలో ఫౌండేషన్ అమలు చేస్తోంది. ఆరోగ్యంపై అవగాహన కలిగిన సమాజాన్ని నిర్మించడంలో ఫ్యూజిఫిల్మ్ ఇండియా నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
భారతీయ మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ప్రధానమైనది. ఐసీఎంఆర్ వారి జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ అంచనాల ప్రకారం, మహిళలకు వచ్చే మొత్తం క్యాన్సర్లలో 14% ఇదే ఉంటోంది. ప్రతి 29 మంది మహిళల్లో ఒకరికి జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు, తగినంత అవగాహన లేకపోవడం, అపోహలు, సరైన వైద్యసదుపాయం అందుబాటులో లేకపోవడంతో చాలా కేసులను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకే ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
స్థానిక స్థాయిలో నమ్మదగిన, సాంస్కృతికంగా సున్నితమైన సమాచారాన్ని అందించేలా ఇది ఉంటుంది. గౌరవప్రదమైన బహిరంగ చర్చలు, వర్క్షాప్లు, అవగాహన సదస్సులు నిర్వహించి, మహిళలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేలా ఇది చూస్తుంది. తద్వారా వారు తమ లక్షణాలను త్వరగా గుర్తించి, స్వీయ పరీక్షల ద్వారా అర్థం చేసుకుని, సరైన సమయానికి చికిత్సలు పొందేలా చూస్తారు.
ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసనా కొణిదెల మాట్లాడుతూ, “వైద్యరంగంలో అగ్రగాములుగా ఉన్న మాకు.. కేవలం అనారోగ్యాలకు చికిత్స చేయడమే కాక.. ముందుగా గుర్తించాల్సిన, అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. తగిన సమాచారం లేకపోవడం, త్వరగా చికిత్స పొందడానికి వనరులు లేకపోవడంతో చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారు. ఈ వాస్తవాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు ఫ్యూజిఫిల్మ్ ఇండియా చేపట్టిన ఈ సీఎస్ఆర్ ప్రచారం ఉపయోగపడుతుంది. ఆలస్యం కాకముందే మహిళలకు తగిన అవగాహన కల్పించడానికి, అవసరమైన చోట అర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది” అని చెప్పారు.
ఫ్యూజిఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజి వాడా మాట్లాడుతూ, “ఈ ప్రపంచానికి మరిన్ని నవ్వులు ఇవ్వాలన్న మా గ్రూప్ లక్ష్యానికి అనుగుణంగా ఫ్యూజిఫిల్మ్ ఇండియా ఎప్పుడూ వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తుంటుంది. విభిన్నమైన ఆలోచనలు, సామర్థ్యాలు, అసాధారణ వ్యక్తుల సాయాన్ని కలపడం ద్వారా ఈ ప్రపంచానికి సంతోషం, నవ్వులు అందించే పరిష్కారాలను సృష్టించడమే మా లక్ష్యం. ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అంటూ రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించే ఈ ప్రచారంతో మహిళలకు తగిన అవగాహన కల్పించి, ఈ వ్యాధిని త్వరగా గుర్తించి, వీలైనన్ని ప్రాణాలను కాపాడాలన్నదే మా లక్ష్యం” అని వివరించారు.
తన సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా ఫ్యూజిఫిల్మ్ ఇండియా సంస్థ ఆరోగ్య సంరక్షణను అందరికీ మరింత అందుబాటులో ఉండేలా చూస్తోంది. ఇప్పటివరకు ఇవి అందనివారికి అందించడం, త్వరగా గుర్తించడం, అవగాహన ద్వారా దాన్ని నివారించే చర్యలు చేపట్టడం కూడా ఇందులో భాగమే. ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే ప్రచారం.. ఫ్యూజిఫిల్మ్ గ్రూప్ సస్టెయినబుల్ వాల్యూ 2030 ప్రణాళికకు అనుగుణంగా ఉంది.
వైద్యం అందరికీ సమానంగా అందాలని, ఇప్పటివరకు అందనివారికి అందించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యం. ప్రభావం బాగా అవసరమైన చోట సేవలు అందించడం ద్వారా ఈ ప్రపంచానికి మరిన్ని నవ్వులు అందించడాలన్న కంపెనీ గ్రూప్ లక్ష్యాన్ని ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది. అది ఒక మారుమూల పట్టణమైనా, జనసాంద్రత ఎక్కువగా ఉండే నగరమైనా.. ప్రతి మహిళకూ తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు, దాన్ని రక్షించుకోవడానికి తగిన అవకాశం ఉండాలని ఫ్యూజిఫిల్మ్ ఇండియా భావిస్తుంది.