
రాంగోపాల్పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. అమ్మవారి బోనాల జాతరకు 15 రోజుల ముందు (ఘటోత్సవం) ఘటాల ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఎదుర్కోలుతోనే బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఘటాలకు సంబంధించిన సామగ్రిని కర్బలా మైదానం ప్రాంతంలోని అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్లి ఘటాన్ని ముస్తాబు చేస్తారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముస్తాబైన ఘటాన్ని డప్పుల దరువులతో దేవాలయానికి తీసుకువస్తారు.
వీధి వీధికి అమ్మవారి దర్శనం
ముస్తాబైన ఘటాన్ని సోమవారం నుంచి వివిధ ప్రాంతాల్లోని భక్తులకు దర్శనం గావిస్తారు. జూలై 11 వరకు ఆయా ప్రాంతాల్లో దర్శనం ఇచ్చి 12న దేవాలయానికి తీసుకువస్తారు. 13న బోనం, 14న రంగం, భవిష్యవాణి అనంతరం అంబారీ ఊరేగింపుతో అమ్మవారి ఘటాన్ని మెట్టుగూడలోని అమ్మవారి ఆలయానికి సాగనంపుతారు.
బోనాలకు అంతా సిద్ధం
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని ఆలయ ఈఓ గుత్తా మనోహర్రెడ్డి తెలిపారు. దేవాలయానికి 80 శాతం రంగుల పనులు పూర్తయ్యాయన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఘటోత్సవానికి హాజరవుతారని చెప్పారు. అనువంశిక ధర్మకర్తలు సురిటి రామేశ్వర్, కామేశ్వర్ పాల్గొన్నారు.