
ఎలివేటెడ్ కారిడార్కు ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్
ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు నిర్మాణం
బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద 600 మీటర్ల టన్నెల్
రూ.15,50 కోట్లతో నిర్మించనున్న హెచ్ఎండీఏ
సాక్షి, హైదరాబాద్: ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్కు(Elevated corridor) ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airport Authority of India) నుంచి తాజాగా అనుమతి లభించనుంది. ప్యారడైజ్(Paradise) నుంచి డెయిరీఫామ్(Dairy farm) వరకు 5.4 కిలోమీటర్ల కారిడార్ మార్గంలో బేగంపేట్ విమానాశ్రయం(Begumpet Airport) వద్ద సుమారు 600 మీటర్ల పొడవుతో సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. విమానాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఎలివేటెడ్కు ప్రత్యామ్నాయంగా సొరంగ మార్గం నిర్మించాల్సి ఉంటుందని హెచ్ఎండీఏ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఎయిర్పోర్ట్ అథారిటి నుంచి అనుమతి లభించడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు ప్రారంభించనుంది.
డెయిరీఫామ్ ఎలివేటెడ్ ప్రత్యేకతలు..
ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్, తాడ్బండ్, బోయిన్పల్లి మీదుగా డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కోసం రూ.652 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. భూసేకరణ కోసం అయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,550 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు వల్ల నగరానికి ఉత్తరం వైపు వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. ప్రస్తుతం సుచిత్ర నుంచి మేడ్చల్ రూట్లో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. డెయిరీఫామ్ ఎలివేటెడ్ అందుబాటులోకి వస్తే జంక్షన్ రహితమైన, సిగ్నల్ర హితమైన, నిరాటంకమైన వాహనాల రాకపోకలు అందుబాటులోకి వస్తాయి.
⇒ ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు మొత్తం 5.4 కిలోమీటర్ల కారిడార్లో 3.05 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది.
⇒ బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద 600 మీటర్ల అండర్గ్రౌండ్ టన్నెల్ను నిర్మిస్తారు.
⇒ మొత్తం ఎలివేటెడ్ కారిడార్ 27 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇందులో 25 మీటర్లు క్యారేజ్వే, 2 మీటర్లు మీడియన్ ఉంటుంది. రెండు వైపులా క్రాష్ బారియర్స్ను ఏర్పాటు చేస్తారు.
⇒ బోయిన్పల్లి జంక్షన్ వద్ద రెండు వైపులా 248 మీటర్ల నుంచి 475 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో ప్రవేశ, నిష్క్రమణ ర్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వాహనాలు 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.
⇒ తాడ్బండ్ జంక్షన్ వద్ద మలుపులతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మార్గంలో 600 మీటర్ల టన్నెల్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు. జియోమెట్రిక్ ప్రత్యేకతలతో టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ టన్నెల్ వల్ల వాహనాల రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది. 44వ జాతీయ రహదారి మార్గంలోనే కాకుండా కారిడార్కు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో కూడా వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి.
శామీర్పేట్ కారిడార్ ఇలా..
సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్రింగ్ రోడ్డు వరకు సుమారు 18.10 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సైతం హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. తిరుమలగిరి, అల్వాల్ మార్గంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం సుమారు 197 ఎకరాల భూమి సేకరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.2,232 కోట్లు అవుతుందని అంచనా. ఈ రూట్లో రక్షణ శాఖ నుంచి, హకీంపేట్ వద్ద ఎయిర్ఫోర్స్ నుంచి అనుమతి లభించాల్సి ఉందని పేర్కొన్నారు. శామీర్పేట్ ఎలివేటెడ్ కారిడార్లో ఎయిర్ఫోర్స్ అనుమతి కీలకం కానుంది. ఈ అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు.
Telangana: రాష్ట్ర బడ్జెట్ రూ. 3.20లక్షల కోట్లు?