తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్‌ | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే.. ఇదేంటి: హైకోర్టు

Published Mon, Apr 19 2021 12:57 PM

TS HC Dissatisfied With KCR Government Over Covid 19 Situation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జనసంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా, ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడంలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘థియేటర్లు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారు. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే మీకు ముఖ్యమా’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

ఇందుకు బదులుగా.. జనసంచారం నియంత్రణకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం.. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా లేదా ఆదేశాలు ఇవ్వమంటారా అని హెచ్చరించింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో మధ్యాహ్నంలోగా నివేదించాలని ఆదేశించింది. అదే విధంగా, సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా,  తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా 4,009 కేసులు నమోదయ్యాయని, 14 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

చదవండి: కరోనా సెకెండ్‌ వేవ్‌: ఏం చేద్దాం? ఎలా చేద్దాం?
అక్రమ కట్టడాలను పూర్తిగా ఎందుకు కూల్చడం లేదు?

Advertisement
Advertisement