కరోనా జాతి వైరస్లన్నింటికీ ఇకపై ఒకే వ్యాక్సిన్
మానవులపై జరిగిన ప్రయోగాల్లో సత్ఫలితాలు
లండన్: కృత్రిమ మేధ(ఏఐ) మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కొత్త రకం టీకాను డిజైన్ చేసింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ టీకాను మానవులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం లక్షల మంది ప్రాణాలు తీసిన కోవిడ్ మహమ్మారి తదనంతర కాలంలో పలు రకాలుగా రూపాంతరం చెందింది.
గబ్బిలాలలో నిద్రాణంగా ఉన్న అనేకానేక కరోనా జాతి వైరస్లు భవిష్యత్తులో ఎప్పుడైనా మానవుల్లోకి చేరి భారీ ప్రాణ నష్టం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకే టీకాతో అన్ని రకాల కరోనా వైరస్ల వ్యాప్తి అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు హానికారక వైరస్లను మన రోగ నిరోధక వ్యవస్థ గుర్తించేలా శిక్షణ ఇస్తాయి. వైరస్ రూపాంతరం చెందితే టీకా పనిచేయదు. కొత్త టీకా తయారు చేయాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు ఏఐ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది.
కరోనా జాతికి చెందిన వేలాది వైరస్ల జన్యుక్రమాలను అన్వేషించింది. అన్నింటిలోనూ మార్పుల్లేకుండా ఉండే, మున్ముందు మారకుండా ఉండే డీఎన్ఏ భాగాలను గుర్తించింది. వీటిని లక్ష్యాలుగా చేసుకుంది. ఫలితంగా కరోనా జాతి వైరస్లన్నింటికీ విరుగుడైన టీకా డిజైన్ సిద్ధమైంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనల కోసం సార్స్, కోవిడ్ వ్యాధులకు కారణమైన సార్బికో వైరస్లను ఏఐ ద్వారా స్కాన్ చేసింది. దీంతోపాటు పలు జంతువుల్లోని కరోనా వైరస్లను పరిశీలించింది.
డీఎన్ఏ టీకా
కోవిడ్కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఎంఆర్ఎన్ఏ టీకా గురించి మనకు తెలిసే ఉంటుంది. ఇది డీఎన్ఏలో ఒక పోగు అయిన ఎంఆర్ఎన్ఏ ఆధారంగా పనిచేస్తే ఏఐ డిజైన్ చేసిన టీకా మొత్తం డీఎన్ఏ ఆధారంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ తయారీ, నిల్వ చాలా సులువు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా ప్రపంచం నలుమూలల్లోనూ సులువుగా పంపిణీ చేయవచ్చు. రిఫ్రిజరేటర్ల వంటి మౌలిక సదుపాయాల అవసరమూ ఉండదు. సూదితో పని లేకుండా ఈ కొత్త తరహా టీకాను అందించవచ్చు కాబట్టి వినియోగం చాలా సులువు అవుతుంది. ఈ సానుకూల అంశాలన్ని భవిష్యత్తులో ఏదైనా కొత్త రకం కరోనా వైరస్ దాడి చేసినా తట్టుకునేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.
పరీక్షల వేళ తేలిందేమిటి?
మెషీన్ లెర్నింగ్ సాయంతో ఏఐ డిజైన్ చేసిన టీకాతో మానవులపై చేపట్టిన ప్రయోగాల్లో రోగ నిరోధక వ్యవస్థ వైరస్కు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేయగలుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ యాంటీబాడీలు సార్బికోవైరస్ రకాలను సమర్థంగా గుర్తిస్తున్నట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ మానవ వినియోగానికి అర్హమైందని, ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే ఈ టీకాను అందరికీ అందుబాటులోకి తెచ్చే ముందు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందని అంటున్నారు. ఈ కొత్త రకం టీకా ఎంతకాలం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది? బూస్టర్ డోస్లు అవసరమవుతాయా? వంటివి నిర్ధారించుకోవడమే కాకుండా వాస్తవిక పరిస్థితుల్లో ఇవి వైరస్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయా? లేదా? అన్నది తెలుసుకోవాల్సి ఉంది. ఇందుకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్కు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని వాణిజ్యవిభాగ పరిశోధనా సంస్థ ‘డియోసిన్వ్యాక్స్’ పర్యవేక్షణలో పరిశోధనలు, క్లినికల్ పరీక్షలు జరిగాయి.


