నాలుగు పథకాలు.. ఒక్కరోజు లబ్ధిదారులు 6,15,677 మంది | TS govt has created record in implementation of schemes: 615677 beneficiaries in one day | Sakshi
Sakshi News home page

నాలుగు పథకాలు.. ఒక్కరోజు లబ్ధిదారులు 6,15,677 మంది

Jan 28 2025 1:42 AM | Updated on Jan 28 2025 1:42 AM

TS govt has created record in implementation of schemes: 615677 beneficiaries in one day

రైతుభరోసాకు రూ.569 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.10.91 కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ  

కూలీలకు భరోసా దేశంలోనే ప్రథమమన్న మంత్రి సీతక్క  

మండలంలో ఒక రెవెన్యూ గ్రామానికి రైతు భరోసా ఇచ్చామన్న మంత్రి తుమ్మల

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజునే 6,15,677 మందికి లబ్ధి చేకూరినట్టు ప్రభుత్వం ప్రకటించింది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థికశాఖ రూ. 579 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం ఉదయం నుంచి రైతులు, వ్యవసాయ కూలీల ఖాతాల్లోకి ఈ నిధులు జమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రామీణ మండలాల్లో ఎంపిక చేసిన 563 రెవెన్యూ గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది.

రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోపాటు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కొత్తగా ఆహారభద్రత కార్డులను జారీ చేసింది. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం మంజూరు పత్రాలను అందించినట్టు ప్రభుత్వం తెలిపింది. పాత కార్డుల్లో అదనంగా కుటుంబసభ్యుల నమో దు ప్రక్రియను పూర్తి చేసినట్టు చెప్పింది.  

రైతుభరోసా 9.48 లక్షల ఎకరాలకు.. 
రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్లు విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలివిడతగా రూ.6 వేల చొప్పు న పెట్టుబడి సాయం అందింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది.  

18,180 కుటుంబాలకు ఆత్మీయ భరోసా 
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద తొలి రోజున 18,180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ.6 వేల చొప్పున నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలిరోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది.  

రేషన్‌కార్డులు.. ఇందిరమ్మ ఇళ్లు 
రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజున 531 గ్రామాల్లో 15,414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటిలో 51,912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. పాత రేషన్‌కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చాలంటూ వేలాది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. 1,03,674 మంది పేర్లను పాత రేషన్‌కార్డుల్లో చేర్చారు. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలి రోజునే అర్హులైన 72 వేల మందికి ఇళ్ల పత్రాలను ప్రభుత్వం అందజేసింది.

చరిత్రలో ప్రప్రథమం.. దేశానికే ఆదర్శం : మంత్రి సీతక్క 
ఏ ఆస్తి లేని కూలీలకు భరోసాగా తెలంగాణ సర్కార్‌ ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. చరిత్రలోనే ప్రప్రథమంగా దేశానికే ఆదర్శంగా నిలుస్తూ వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.  

మండలంలో ఒక రెవెన్యూ గ్రామానికి : తుమ్మల 
రైతుభరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో రెవెన్యూ గ్రామం చొప్పున విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అవి సోమవారం రైతుల అకౌంట్లలో జమ అయ్యాయన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తామన్నారు

Advertisement
 
Advertisement
Advertisement