ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి.. | Trauma care centers to be set up on highways | Sakshi
Sakshi News home page

ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి..

Dec 23 2024 3:13 AM | Updated on Dec 23 2024 3:13 AM

Trauma care centers to be set up on highways

హైవేలపై ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ

రెంజల్‌ (బోధన్‌)/నిజామాబాద్‌ నాగారం: జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మరణాలను నివారించేందుకు ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మా ట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా 300 వరకు హెల్త్‌ సబ్‌సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలలో కేన్సర్‌ చికిత్స కేంద్రాలతో పాటు వాస్క్యులర్‌ యాక్సెస్‌ సెంటర్‌లను త్వరలో ప్రారంభిస్తామన్నారు.  

జీజీహెచ్‌లో ఏం జరుగుతోందో నాకు తెలుసు.. 
‘నిజామాబాద్‌లోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (జీజీహెచ్‌)లో ఏం జరుగుతోందో నాకు తెలుసు. 60 శాతం మంది వైద్యులు విధులకు గైర్హాజరు అవుతున్నారు. నా వద్ద పూర్తి సమాచారం ఉంది’అని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీస్‌ చేస్తే చర్య లు తప్పవని హెచ్చరించారు. వందరోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటిలోగా మార్పు రాకుంటే కఠిన చర్యలు ఉంటాయ న్నారు. 

ఆదివారం ఆయన జీజీహెచ్‌ను సందర్శించారు. ఆస్పత్రిలో పైపులైన్‌ లీకేజీ, భవనాలపై పిచ్చిమొక్కలు పెరగడం, కిటికీల అద్దాలు పగిలిపోవడం, లిఫ్ట్‌లు చెడిపోవడం, ఎలు కలు తిరుగుతుండటాన్ని గమనించి సూపరింటెండెంట్‌ ప్రతి మారాజ్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జీజీహెచ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ. 7 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. 

ఈ కార్యక్రమాలలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, రాకేశ్‌రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement