
ఎన్కౌంటర్లో మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ మృతి
మృతుడిది ఆదిలాబాద్ జిల్లా పొచ్చర
ఇంద్రావతి టైగర్ రిజర్వ్లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఆదిలాబాద్ /చర్ల: వరుస ఘటనలు చూస్తుంటే... తెలుగు నేతలే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్లు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కులో గురు, శుక్రవారాల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారు. గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం, శుక్రవారం తెలంగాణ కమిటీ సభ్యుడు మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ చనిపోయారు. కాగా, ఆయన తెలంగాణ కమిటీతోపాటు స్పెషల్ జోనల్ కమిటీలోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. భాస్కర్పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు, తెలంగాణ నుంచి రూ.20 లక్షల రివార్డు ఉండగా, ఆయన మృతదేహం వద్ద ఏకే 47 తుపాకీ లభించింది.
మూడో అంచెపై వల
మావోయిస్టులను దెబ్బ తీసేందుకు పోలీసులు, భద్రతా దళాలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అమలుచేస్తున్నా యి. అగ్ర నేతలకు మూడంచెల భద్రత ఉంటుంది. ఇందులో తొలి అంచెలో అగ్రనేతతోపాటు అతని సపోర్టింగ్ స్టాఫ్, రెండు, మూడో అంచెలో ఇతర మావోలు ఉంటారు. వీరిలో ఎక్కువమంది బస్తర్ వాసులే ఉంటున్నారు. అగ్రనేతలే టార్గె ట్గా దాడులు జరిగినప్పుడు ఎక్కువగా చనిపోయే వారిలో వీరే ఉంటున్నారు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ ‘తెలుగు నేతలను కాపాడేందుకు మీరు ఎందుకు చనిపోవాలి’అంటూ ప్రచార కార్యక్రమాన్ని వ్యూహత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నా రు.
ఇది సత్ఫలితాలను ఇస్తోందని పోలీసులే బాహాటంగా ఒప్పుకుంటున్నారు. దీనికి తగ్గట్టే ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ముందు ఆయన రక్షణ టీమ్లో ముగ్గురు మావోలు లొంగిపోవడం తీవ్రనష్టానికి దారి తీసింది. అంతకు ముందు దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను విష యంలో ప్రస్తుతం సుధా కర్, మైలారపు ఆడెళ్లు విష యంలోనూ ‘కోవర్ట్’ తర హా ఆపరేషన్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరంపరలో నేటి తరం అగ్రనేత, బస్తర్ మూలవాసి, మోస్ట్వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న మడావి హిడ్మా లేటెస్ట్ ఫొటోను సైతం భద్రతా దళాలు సంపాదించాయి.
హిట్లిస్ట్లో తెలుగు నేతలు
తెలంగాణ నుంచి మల్లోజుల వేణుగోపాల్ తి ప్పర్తి తిరుపతి. పాక హనుమంతు , కడారి సత్యనారాయణరెడ్డి, తక్కెళ్లపల్లి వాసుదేవరావు, చంద్రన్న, బండి ప్రకాశ్, రామన్న, పాపారావు, కంకణాల రాజిరెడ్డిలు మావోయిస్టు పార్టీలో అగ్రనేతలుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్తో పాటు కొయ్యాడ సాంబయ్య, వెంకటేశ్ కూడా కీలక నేతలుగా ఉన్నారు. వీరి కదలికపై కన్నేసిన భద్రతా దళాలు అనుకూల సమయం చూసి దాడి చేస్తున్నట్టు తెలు స్తోంది. ఇంద్రావతి నదీతీరంలో రెండో రోజైన శుక్రవారం కూడా మావోలు – పోలీసుల బలగాల నడుమ కాల్పులు కొనసాగాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పారు.
మూడు దశాబ్దాల క్రితమే ఉద్యమంలోకి..
మైలారపు ఆడెళ్లుది ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చర స్వస్థలం. బోథ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన ఆడెళ్లు...1989లో నిర్మల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేరాడు. ఆ సమయంలో భూపోరాటాలు ఉధృతంగా సాగేవి. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. దానికి అధ్యక్షుడిగా పనిచేశాడు.ఆ తర్వాత ఉద్యమం వైపు మళ్లి 1995లో నక్సల్స్లో చేరాడు. మొదట బోథ్ దళ సభ్యుడిగా, ఆ తర్వాత ఇంద్రవెల్లి దళ డిప్యూటీ కమాండర్గా పనిచేసి, దండకారణ్యంలోకి వెళ్లిపోయాడు.
ఉద్యమంలో ఉన్న సమయంలోనే నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మిసాగర్ గ్రామానికి చెందిన దళ సభ్యురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నారు. 2022 డిసెంబర్లో మహారాష్ట్ర–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతిచెందింది. అప్పటి నుంచి అడెల్లు దండకారణ్యంలోనే ఉంటున్నారు. ఆయన సోదరులు మాత్రమే స్వగ్రామంలో ఉంటున్నారు. ఆడెళ్లు మరణ వార్తతో పొచ్చరలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అతని పెద్ద సోదరుడు పేరు కూడాఆడెళ్లు. మావోయిస్టు ఆడెళ్లు మృతిచెందిన వార్త తెలిసిన తర్వాత ఆయన తన ఇంటివైపు ఎవరూ రావద్దని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆడెళ్లు మృతదేహాన్ని పొచ్చరకు తీసుకొస్తారా.. అందుకు సోదరులు సమ్మతిస్తారా అనేది చూడాల్సిందే.