తెలంగాణలో భారీగా పెరగనున్న ఇంజనీరింగ్‌ ఫీజులు.. ఎఫ్‌ఆర్‌సీ ఆమోదం | TFRC Approved for increase in engineering Colleges fees | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా పెరగనున్న ఇంజనీరింగ్‌ ఫీజులు.. ఆమోదముద్ర వేసిన ఎఫ్‌ఆర్‌సీ 

Aug 1 2022 3:25 AM | Updated on Aug 1 2022 2:41 PM

TFRC Approved for increase in engineering Colleges fees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజు పెంపునకు సంబంధించిన మదింపు ప్రక్రియ పూర్తయింది. ఏ కాలేజీకి ఎంత ఫీజు అనేది రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్‌ఆర్‌సీ) నిర్ధారించింది. ఈ వ్యవహారంపై కమిటీ ఇటీవల భేటీ అయి, పెంపునకు ఆమోదం తెలిపింది. ఇదే క్రమంలో పెంపు నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఆగస్టు 5వ తేదీలోగా ఫీజుల పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు తెలిపాయి. దీంతో 2022–23 విద్యాసంవత్సరం నుంచే కొత్త ఫీజులు అమలుకానున్నాయి. ఎఫ్‌ఆర్‌సీ మూడేళ్లకోసారి ఫీజులను నిర్ధారిస్తుంది. 2019లో ప్రకటించిన ఫీజులు 2022 విద్యా సంవత్సరం వరకూ అమలులో ఉన్నాయి.  
కనీసం రూ.10 వేలు.. 
రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజులు కనిష్టంగా రూ.35 వేలు, గరిష్టంగా 1.40 లక్షల వరకూ ఉన్నాయి. ఇప్పుడీ ఫీజు కనిష్టంగా రూ.45 వేలు, గరిష్టంగా రూ.1.73 లక్షలు ఉండే అవకాశముంది. దీన్ని బట్టి కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.32 వేలు పెంచే వీలుంది. తెలంగాణలో మొత్తం 175 ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. వీటిల్లో 21 కాలేజీల్లో ఫీజు రూ.లక్షకుపైగానే ఉంది.

పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తే ఈ ఏడాది వీటిసంఖ్య 40పైనే ఉండే అవకాశముంది. 25 కాలేజీల్లో రూ.75 నుంచి రూ.లక్ష వరకూ ఫీజులన్నాయి. ఈసారి ఈ కాలేజీల్లో ఎక్కువశాతం రూ.25 వేల వరకూ వార్షికఫీజు పెంపునకు ఎఫ్‌ఆర్‌సీ ఒప్పుకుంది. మూడేళ్ల క్రితం ఫీజులు పెంచినా రూ.లక్ష దాటిన కాలేజీలు నాలుగు ఉంటే, ఇప్పుడు 40కిపైగానే ఉండే అవకాశముంది. పెంచే ఫీజులు మూడేళ్లపాటు అమలులో ఉంటాయి.    

Advertisement
 
Advertisement
Advertisement