ప్రత్యక్ష బోధనపై ఆచితూచి అడుగులు | Telangana: State Government On Direct Education | Sakshi
Sakshi News home page

ప్రత్యక్ష బోధనపై ఆచితూచి అడుగులు

Aug 17 2021 4:48 AM | Updated on Aug 17 2021 4:48 AM

Telangana: State Government On Direct Education - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యక్ష విద్యాబోధనపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. తాజా పరిస్థితిపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) మరోసారి నివేదిక కోరినట్టు తెలిసింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయని గతంలో వైద్యశాఖ సానుకూల నివేదిక ఇచ్చింది. విద్యాసంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచీ ప్రత్యక్ష తరగతులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 1 నుంచి దశలావారీగా విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలనూ విద్యాశాఖ రూపొందించింది. అయితే బెంగళూరులో పిల్లలకు కరోనా సోకడంతో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఇప్పటికే విద్యాసంస్థలు తెరిచిన ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

దీంతోపాటు ఏపీలో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రత్యక్ష బోధనతో ఎదురయ్యే సమస్యలను గమనించాకే నిర్ణయం తీసుకునే వీలుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో సెప్టెంబర్‌ 1 నుంచి 9–12 తరగతులు 50 శాతం విద్యార్థులతో ప్రత్యక్ష బోధన చేపట్టాలని భావిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 9–12 తరగతులను రెండు బ్యాచ్‌లుగా విభజించి, రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిం చాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం 50 శాతం సామర్థ్యంతో ప్రత్యక్ష బోధనకు ఉపక్రమించింది. ఒడిశా జూలై 26 నుంచే 10, 12 తరగతులు విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేపట్టింది. మహా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మంగళ వారం నుంచి ప్రత్యక్ష తరగతులకు ఉపక్రమిం చింది. ఢిల్లీ మాత్రం వాస్తవ పరిస్థితిపై నిపుణులతో కమిటీ వేసింది. వీటిని పరిశీలించి రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సీఎం నిర్ణయం కొంత ఆలస్యమయ్యేలా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement