
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాలానగర్లో ఎస్వోటీ కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుతో మృతిచెందారు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో సదరు కానిస్టేబుల్ తనిఖీలకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు.
వివరాల ప్రకారం.. బాలానగర్లో పరిధిలోని ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఎస్వోటీ పోలీసులు.. తనిఖీల కోసం అక్కడికి చేరుకున్నారు. అక్కడ సోదాలు జరుగుతున్న సమయంలో ఎస్వోటీ కానిస్టేబుల్ ప్రవీణ్ గుండెపోటుతో నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ప్రవీణ్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం, ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.