Telangana: Singareni Company Sets Record In Annual Coal Production Sale, Details Inside - Sakshi
Sakshi News home page

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి రికార్డు.. ఎన్ని కోట్ల టర్నోవరంటే!

Apr 3 2023 5:20 PM | Updated on Apr 3 2023 6:52 PM

Telangana: Singareni Company Sets Record in Coal production Sale - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కాలరీస్ కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 32,830 కోట్ల రూపాయల అమ్మకాలను (టర్నోవర్) సాధించి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం(2021-22)లో సాధించిన 26,619 కోట్ల రూపాయల టర్నోవర్‌పై 23 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. తెలంగాణ ఏర్పాటుకు ముందు (2013-14)లో సింగరేణి సాధించిన 12,000 కోట్ల టర్నోవర్ తో పోల్చితే ఇది  173 శాతం అధికం.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి సాధించిన ప్రగతికి ఇది నిదర్శనంగా పేర్కొనవచ్చు.  

ఈ వివరాలను సంస్థ ఛైర్మన్ ఎండీ ఎన్. శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడిస్తూ.. సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, కార్మిక సంఘాల నాయకులకు తన అభినందనలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 50 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే ఉండగా.. ఇప్పుడు 10 కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ రంగాల్లో కూడా ప్రవేశించడంతో ఈ అభివృద్ధి సాధ్యమైంది. 

గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో ఇంత భారీ టర్నోవర్ వృద్ధిని  సాధించిన సంస్థ  సింగరేణే కావడం విశేషం. బొగ్గు అమ్మకాలలో 25 శాతం.. విద్యుత్ అమ్మకాలలో 13 శాతం వృద్ధి.. సింగరేణి సంస్థ 2022-23లో  సాధించిన ఈ టర్నోవర్ లో బొగ్గు అమ్మకాల ద్వారా 28, 459 కోట్లు,  సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా జరిపిన విద్యుత్ అమ్మకం ద్వారా 4,371 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం కూడా ఆల్‌టైం రికార్డుగా ఉంది. 

అంతకు ముందు ఏడాది(2021-22) సాధించిన  22740 కోట్ల రూపాయల బొగ్గు అమ్మకాలతో పోల్చితే సింగరేణి ప్రస్తుతం 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే విద్యుత్ అమ్మకాల్లో 2021-22లో జరిపిన 3,879 కోట్ల టర్నోవర్‌తో పోల్చితే ప్రస్తుతం 13 శాతం వృద్ధిని నమోదు చేసింది.  బొగ్గు,  విద్యుత్ అమ్మకాలు కలిపి మొత్తమ్మీద 2021-22 కన్నా 23 శాతం వృద్ధిని సింగరేణి సంస్థ 2022-23 లో నమోదు చేసి సరికొత్త రికార్డును లిఖించింది.

Advertisement
 
Advertisement
Advertisement